నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 66 పాయింట్లు డౌన్
స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. వరుస నష్టాలకు నిన్న బ్రేక్పడిన అనంతరం నేడు (శుక్రవారం, జూలై 30) మళ్లీ సూచీలు కాస్త పడిపోయాయి. సెన్సెక్స్ నేడు 66.23 పాయింట్లు నష్టపోయి 52,586.84 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15.40 పాయింట్లు నష్టపోయి 15,763.05 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 15,800.60 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ, 15,862.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,744.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 52,792.36 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,910.23 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,533.91 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. అయితే, కీలక రంగాల్లో గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో గరిష్ఠాల నుండి సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్ 66 పాయింట్ల నష్టంతో 52,586 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 15,763 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.43 వద్ద నిలిచింది.
బీఎస్ఈ 30 సూచీలో సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటాన్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. మెటల్, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు సూచీలను కిందకు లాగాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్బీఐ, రిలయన్స్, టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, ఎస్బీఐ ఉన్నాయి. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్బీఐ, రిలయన్స్ ఉన్నాయి.