కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, రూ.3.2 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జూన్ 10, 2022) భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, వివిధ దేశాల్లో కరోనా పెరుగుదల, మరోవైపు ద్రవ్యోల్భణ ఆందోళనలు వంటి అంశాలు ప్రభావం చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే పతనమైన సూచీలు, ఆ తర్వాత నష్టాలను కొనసాగించాయి. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా పతనమైంది.
మార్కెట్ నష్టాలకు కారణాలు
అమెరికా ద్రవ్యోల్భణ గణాంకాలు శుక్రవారం వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి మార్కెట్లు అప్రమత్తంగా కదలాడాయి. ద్రవ్యోల్భణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఫెడ్ నిర్ణయాలు ఉంటాయి. వచ్చే వారం ఫెడ్ సమావేశంలో వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చునని భావిస్తున్నారు. దీంతో అక్కడి మార్కెట్లు పతనమయ్యాయి.
ఎఫ్ఐఐల అమ్మకాలు
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం కారణంగా క్రూడ్, ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆర్బీఐ కూడా ఇదే అంచనా వేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. గత కొద్ది రోజులుగా FII అమ్మకాలు వెల్లువెత్తాయి. గురువారం నాటి ట్రేడింగ్లో FIIలు రూ.2407 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను FIIలు ఉపసంహరించుకున్నారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్షీణిస్తోంది.
రూ.3.2 లక్షల కోట్లు డౌన్
పై కారణాల నేపథ్యంలో సెన్సెక్స్ నేడు 1016 పాయింట్లు లేదా 1.84 శాతం క్షీణించి 54,303 పాయింట్ల వద్ద, నిఫ్టీ 276 పాయింట్లు లేదా 1.68 పాయింట్లు క్షీణించి 16,201 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బ్యాంకు, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు భారీగా కుంగిపోయాయి. నేడు సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.2 లక్షల కోట్లకు పైగా క్షీణించింది.