Billioneaires: భారత దిగ్గజ కంపెనీల పగ్గాలు నవతరానికి.. కుటుంబ వారసులొస్తున్నారు..
Billioneaires: దేశంలో వ్యాపారాలు ఇదివరకులా లేవు. రోజురోజుకూ వస్తున్న కొత్త మార్పులు, వ్యాపార పద్ధతులు, మారుతున్న ప్రజల అవసరాలు, ప్రజల కోరికలకు అనుగుణంగా దిగ్గజ వ్యాపాల సారధులు కొత్త సేవలతో ప్రజల ముందుకు వస్తున్నారు. దీనికి వారి యువతరం ఊతమిస్తోంది. సాంకేతిక యుగంలో న్యూ జనరేషన్ వినియోగదారులకు అవసరమైన, వారు ఇష్టపడే విధంగా వ్యాపారాల్లో మార్పులు చేసేందుకు వారు తల్లిదండ్రులకు వ్యాపారంలో సాయం చేస్తూ.. వ్యాపార అనుభవాన్ని గడిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వారు సదరు కంపెనీల బాధ్యతలను చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయంలోనూ అదే జరిగింది. ఆకాష్ అంబానీకి రిలయన్స్ జియో, ఇషా అంబానీలకు రిలయన్స్ రిటైల్ బాధ్యతలు అప్పగించి తండ్రి దిగ్గజ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ పక్కకు తప్పుకోవటం దీనినే సూచిస్తుంది.
ముఖేష్ అంబానీ:
చమురు నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాల్లోకి విస్తరించిన రిలయన్స్ గ్రూప్ యజమాని ముఖేష్ అంబానీ నవతరానికి తన బాధ్యతలను అప్పగించారు. తాజాగా రిలయన్స్ జియోకు కుమారుడు ఆకాష్ అంబానీని ఛైర్మన్ చేసిన తరువాత నిన్న కూతురు ఇషా అంబానీని రిలయన్స్ రిటైల్ గ్రూప్ ఛైర్మన్ గా ప్రకటించారు. త్వరలోనే చిన్నకుమారుకు అనంత్ అంబానీకి కూడా త్వరలోనే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన విషయంలో జరిగినట్లుగా జరగకూడదనే ముందుగా ముఖేష్ వారసులకు కంపెనీల పగ్గాలు అప్పగించే పనిలో ఉన్నారని కొందరు అంటున్నారు.
గౌతమ్ అదానీ:
ప్రస్తుతం దేశంలో అదానీ గురించి తెలియని వారు ఉంటారని భావిచటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే గత కొంత కాలంగా ఆయన విద్యుత్ నుంచి సిమెంట్, నిర్మాణంతో పాటు ఇతర అనేక రంగాల్లోకి తన వ్యాపారాలను వేగంగా విస్తరిస్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా ఉన్న అదానీకి కరణ అదానీ, జీత్ అదానీలు వారసులుగా ఉన్నారు. కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ వ్యాపారాలను చూసుకుంటుండగా, జీత్ అదానీ 2019లోని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.
శివ్ నాడార్:
HCL టెక్నాలజీస్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న శివ్ నాడార్ కూడా వారసులకు పగ్గాలు అప్పగించారు. కుమార్తె రోష్ని నాదార్ కంపెనీ చైర్ పర్సన్ గా ఉన్నారు. దీనికి తోడు ఆమె హెచ్సీఎల్ ఆపరేటింగ్ కంపెనీల హోల్డింగ్ కంపెనీ HCL కార్పొరేషన్ కు సీఈవో గా ఉన్నారు.
సైరస్ పూనావాలా:
కరోనా టీకాను తయారు కేవలం మన దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేసిన ఘనత ఈ వ్యాపార కుటుంబానిది. సీరమ్ సంస్థ వీరికి సంబంధించినదే. వీరు ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, ఫైనాన్స్, క్లీన్ ఎనర్జీ, హీస్పిటాలిటీ, ఏవియేషన్ వంటి రంగాల్లో వ్యాపారాలు కలిగి ఉన్నారు. సైరస్ పూనావలా 2011లో తన కుమారుడు ఆదాన్ కు వ్యాక్సిన్ వ్యాపార పగ్గాలు అందుకున్నారు. ఆయన కంపెనీని కొత్త పుంతలు తొక్కిస్తూ ఫైనాన్స్ రంగంలోకి విస్తరించారు.
రాధాకిషన్ దమానీ:
రాధాకిషన్ దమానీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది డీమార్ట్ అని చెప్పుకోవాలి. ఆయన గతంలో మంచి పెట్టుబడి దారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. దలాల్ స్ట్రీట్ లో పనిచేసే తండ్రి మృతి చెందటంతో బాల్ బేరింగ్ వ్యాపారాన్ని విడిచి ట్రేడింగ్ లోకి దిగారు. ముగ్గురు కుమార్తెలు కలిగిన దమానీ.. పెద్ద కుమార్తె చందక్ కు అవెన్యూ సూపర్ మార్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్, మిగిలిన ఇద్దరు కుమార్తెలైన జ్యోతి కబ్రా, మధు చందక్ లకు బాంబే స్వదేశీ స్టోర్స్ లో డైరెక్టర్ల పగ్గాలను అప్పగించారు. వీరికి కంపెనీలో సగం వాటా ఉంది.
లక్ష్మీ మిట్టల్:
లక్ష్మీ మిట్టల్ ఉక్కు రంగంలో అతి పెద్ద ప్రేయర్ గా ఉన్నారు. ప్రపంచ ఉక్కు తయారీలో వీరి కంపెనీ ఆర్సెల్లార్ మెుదటి స్థానంలో ఉంది. వీరికి మైనింగ్, స్టీల్ రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. మిట్టల్ వారసులు ఆదిత్య మిట్టల్, వనీషా మిట్టల్ కంపెనీల్లో ఇప్పటికే బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆదిత్య ఆర్సెలార్ మిట్టల్ సీఈవోగా ఉండగా.. సోదరి వనీషా మిట్టల్ స్టీల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు.
జిందాల్ గ్రూప్:
ఓపీ జిందాల్ వారసులైన పృథ్వీ, సజ్జన్, రతన్, నవీన్ తండ్రి మరణంతో కుటుంబ వ్యాపారాలను పంచుకున్నారు. పృథ్వీ జిందాల్ SAWను, సజ్జన్ JSW జిందాల్ ను, రతన్ జిందాల్ స్టెయిన్ లెస్, నవీన్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ పగ్గాలు పంచుకున్నారు. ప్రస్తుతం వీరి వారసులు సైతం వ్యాపారాల్లోకి అరంగేట్రం చేసి నవనాయకత్వంతో కంపెనీలను ముందుకు తీసుకు వెళుతున్నారు.
కుమార మంగళం బిర్లా:
ప్రస్తుతం కుమార మంగళం బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయనకు ముగ్గురు వారసులు. అనన్య, అద్వైతేష్ లు వ్యాపాల్లోకి ప్రవేశించారు. మరో పక్క కుమారుడు ఆర్యమాన్ సైతం వెంచర్ క్యాపిటల్ విభాగానికి వ్యవస్థాపకుడుగా ఉన్నారు.
దిలీప్ షాంఘ్వీ:
దిలీప్ షాంఘ్వీ అంటే అందరికీ గుర్తుకొచ్చేది సన్ ఫార్మాస్యూటికల్స్. ఈయన వారసులు అలోక్ షాంఘ్వీ కంపెనీ ఎమర్జింగ్ మార్కెట్స్ విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. మరో వారసురాలు విధి సల్గావ్కర్ కన్స్యూమర్ హెల్త్ కేర్ వ్యాపారానికి అధిపతిగా కొనసాగుతున్నారు.
అజీమ్ ప్రేమ్ జీ:
అజీమ్ ప్రేమ్ జీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది విప్రో సంస్థ. విప్రో సంస్థకు చెందిన సంతూర్ సబ్బు భారతీయులకు చాలా సుపరిచితం. సాఫ్ట్ వేర్, ఎఫ్ఎమ్సీజీ, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యాపారాల్లోకి విస్తరించి ఉంది. కుమారుడు రిషత్ ప్రేమ్ జీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్, బిజినెస్ ప్రాససింగ్ పగ్గాలు చూసుకుంటున్నారు. మరో కుమారుడు తారిక్ ప్రేమ్ జీ కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్టర్ ఇంజనీరింగ్ బాధ్యతులు చేపడుతున్నారు. తారిక్ అజీమ్ ప్రేమ్ జీ ఎండోమెంట్ ఫండ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇలా దేశంలోని కుబేరుల నవతరం వారసులు తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని వ్యాపారాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు.