మ్యానుఫ్యాక్చరింగ్ PMI రికవరీ, సర్వీస్ PMIపై కరోనా ప్రభావం
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సేవారంగ కార్యకలాపాలు వరుసగా మూడో నెల జూలైలో దెబ్బతిన్నాయి. కరోనా నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ కారణంగా సేవారంగం నెమ్మదించింది. జులై నెలలో ఈ రంగంలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(PMI) 45.4గా నమోదయింది. జూన్ నెలలో నమోదైన 41.2తో పోలిస్తే పుంజుకుంది. PMI సూచీ 50 పాయింట్లను మించితే ఆ రంగంలో వృద్ధిని సూచిస్తుంది. 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతకు సంకేతం. ఈ మేరకు ఐహెచ్ఎస్ మార్కెట్ నెలవారీ సర్వే నివేదిక బుధవారం నాడు విడుదలయింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిమాండ్ పడిపోయిందని పేర్కొంది. వ్యాపారాలు, ఉత్పత్తి, ఉద్యోగాలు పడిపోయాయని, అంతర్జాతీయంగా కూడా సేవా రంగంలో డిమాండ్ పడిపోయిందని వెల్లడించింది. కన్జ్యూమర్ సర్వీసులు భారీగా దెబ్బతిన్నట్లు తెలిపింది. రవాణా, నిల్వ రంగాలు మాత్రం కాస్త సానుకూలంగా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరంగ్ PMI జూలై నెలలో రికవరీ కనిపించగా, సర్వీస్ PMIపై కరోనా ప్రభావం కనిపించింది.
ఇక, నిర్వహణ, పెట్టుబడి వ్యయాలు పెరిగిపోయాయని ఐహెచ్ఎస్ మార్కెట్ సర్వే తెలిపింది. ఇంధనం, వైద్య పరికరాలు, ముడిపదార్థాల ధరలు జులైలో పెరిగాయని వెల్లడించింది. ఈ రంగంలో ఉద్యోగ కల్పన క్షీణించిందని పేర్కొంది. రానున్న ఏడాది కాలంలో సేవారంగంలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. అందుకే కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి కంపెనీలు ఆసక్తి కనబరచడం లేదని తెలిపింది.