రేపటి నుండి గోల్డ్ హాల్మార్కింగ్ తప్పనిసరి, ఎందుకంటే
బంగారం హాల్మార్కింగ్ రేపటి నుండి (జూన్ 15, 2021) తప్పనిసరి. అంతకుముందు జూన్ 1 గడువు ఇవ్వగా, దీనిని మరో పదిహేను రోజులు పొడిగించారు. కేంద్రం గోల్డ్ జ్యువెల్లరీ హాల్ మార్కింగ్ నిబంధనల అమలును గతంలోనూ పలుమార్లు పొడిగించింది. ఈ ఏడాది జనవరిలో గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ గడువును జూన్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత జూన్ 15కు పొడిగించింది. హాల్ మార్క్ లేకుండా రేపటి నుండి బంగారు ఆభరణాలు విక్రయించలేరు.
హాల్ మార్కింగ్ తప్పనిసరి
22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలి. హాల్ మార్క్ ఉంటే ఇటు కస్టమర్, అటు బంగారం వ్యాపారి ఇద్దరికీ ప్రయోజనం. పసిడి నాణ్యతపై ఎలాంటి సందేహాలు ఉండవని తెలిపింది. BIS హాల్మార్కింగ్ స్కీంలో ఆభరణాలకు రిజిస్ట్రేషన్ మంజూరు, అస్సైయింగ్ అండ్ హాల్ మార్కింగ్(A&H)కు గుర్తింపు ఉంటుంది. ఆభరణాల హాల్ మార్కింగ్ ప్రక్రియలో BIS-A&H సెంటర్లో నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం A&H సెంటర్లో హాల్ మార్కింగ్ ముద్రను వేస్తారు. రిజిస్టర్డ్ జ్యువెల్లర్స్ హాల్ మార్కింగ్ కోసం BIS రికగ్నైజ్డ్ A&H సెంటర్కు ఆభరణాలను ఇస్తే, పరీక్ష అనంతరం హాల్ మార్కింగ్ వేస్తారు.
హాల్ మార్కింగ్ ఛార్జీలు
BIS జ్యువెల్లర్స్ రిజిస్ట్రేషన్ను సులభతరం చేసింది. ఈ పూర్తి ప్రక్రియ కూడా మ్యాన్యువల్గా కాకుండా ఆన్లైన్ ద్వారా ఉంటుంది. జ్యువెల్లర్స్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. సంబంధిత పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తుదారు BIS రిజిస్టర్డ్ జ్యువెలర్ అవుతారు. BIS రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తక్కువగా నిర్ణయించారు. టర్నోవర్ రూ.5 కోట్ల కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7500, రూ.5 కోట్ల నుండి 25 కోట్లు టర్నోవర్ అయితే రూ.15,000, రూ.25 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.40 వేలు చెల్లించాలి. టర్నోవర్ రూ.100 కోట్లు దాటితే రూ.80 వేలు చెల్లించాలి. హాల్ మార్క్కు గతంలో 15 జనవరి 2021 వరకు గడువు ఇచ్చారు. జ్యువెల్లరీ అసోసియేషన్ డిమాండ్ మేరకు జూన్ 1వ తేదీ వరకు పొడిగించారు.
అందుకే తప్పనిసరి
కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు హాల్ మార్కింగ్ను తప్పనిసరి చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ ఉండటం లేదు. దీని వల్ల ఆ ఆభరణం ఎంత నాణ్యతతో ఉన్నదో తెలుసుకునే అవకాశం ఉండటం లేదు. దీంతో బంగారు ఆభరణాల కొనుగోలుదారులకు నష్టం జరుగుతున్నట్టు చెబుతున్నారు.