350 ఉద్యోగుల తొలగింపు, మేక్ మై ట్రిప్ వంతు, తప్పడం లేదని సీఈవో లేఖ
కరోనా వైరస్ అన్నీ రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రాజెక్టులు లేక, కొత్తవి రాకపోవడంతో కంపెనీలు తమ ఖర్చుల తగ్గింపుపై దృష్టిసారించింది. కొన్ని కంపెనీలు జీతాలు తగ్గిస్తోండగా.. మరికొన్ని స్టాఫ్ను కుదిస్తోన్నాయి. ఇప్పటివరకు చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించగా.. ఇప్పుడు అదేబాటలో మేక్ మై ట్రిప్ కూడా పయనిస్తోంది.
350 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ వల్ల పర్యాటక రంగం కుదేలైందని.. దీంతో వ్యాపార పునరుద్ధరణ ఇప్పట్లో జరగదని పేర్కొన్నది. ఈ మేరకు మేక్ మై ట్రిప్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దీప్ కల్రా, సీఈవో రాజేశ్ మాగో ఉద్యోగులకు లేఖను ఈ మెయిల్ చేశారు. ఇతరుల కన్నా కంపెనీపై వైరస్ ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో రెండు నెలలుగా పరిస్థితిని గమనించామని సీఈవో రాజేశ్ లేఖలో తెలిపారు. వ్యాపార పునరుద్దరణకు మార్గం అన్వేషించామని.. కానీ వ్యాపార మార్గాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. ఇప్పట్లో పర్యాటక రంగం కొలుకునే అవకాశం లేదని.. తమకు ఉద్యోగులను తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేదు అని తెలిపారు. తాము ఇప్పుడు తీసుకుంటున్న చర్య కంపెనీ భవిష్యత్ కోసం ఆలోచించి చేసిందని పేర్కొన్నారు.