మేకిన్ ఇండియా : డిసెంబర్ నాటికి భారత్లో శాంసంగ్ టీవీ ప్లాంట్...
మేకిన్ ఇండియాలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారత్లో టీవీ ఉత్పత్తులను(మాన్యుఫాక్చరింగ్) ప్రారంభించనున్నట్లు శాంసాంగ్ ఇండియా పేర్కొంది. అయితే అప్పటివరకు టీవీ సెట్స్ను దిగుమతి చేసుకునేందుకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాబోయేది దసరా,దీపావళి పండుగ సీజన్ కావడంతో... బిజినెస్ కంటిన్యుటీ దెబ్బతినకుండా ఉండాలంటే టీవీ సెట్స్ను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఐటీ&ఎలక్ట్రానిక్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు శాంసంగ్ ఇండియా ఓ లేఖ రాసింది.
దేశంలో టీవీ మాన్యుఫాక్చరింగ్ను ప్రారంభించాలంటే ఇప్పుడు తమ బిజినెస్ సజావుగా సాగాల్సిన అవసరం ఉందని శాంసాంగ్ తమ లేఖలో పేర్కొంది. దిగుమతులపై ఆంక్షలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు వ్యతిరేకమని పేర్కొంది. ఇదే విషయమై శాంసంగ్ ఇండియా ప్రధాని కార్యాలయానికి,డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కార్యాలాయానికి కూడా లేఖ రాసిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికైతే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
ఈ ఏడాది జులైలో టీవీ సెట్ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను పెంచడం... చైనాపై దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో టీవీ సెట్లు దిగుమతి చేసుకోవాలనుకునే కంపెనీలు కేంద్రం నుంచి తప్పనిసరిగా లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీవీ సెట్ల దిగుమతికి అనుమతి కోరుతూ శాంసంగ్ ఇండియా కేంద్రానికి లేఖ రాసింది.
గతంలో చెన్నైలో శాంసంగ్కి టెలివిజన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఉండేది. అయితే దిగుమతి సుంకాల భారంతో టీవీల తయారీ ఖర్చు పెరిగిపోవడంతో శాంసంగ్ 2018లో చెన్నై ప్లాంట్ను మూసివేసింది. భవిష్యత్తులో ఆ ప్లాంట్ను తిరిగి తెరిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ భారత్లోనే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పడితే దిగుమతుల కోసం మరో దేశంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది.