కరోనా వాక్సిన్ అభివృద్ధిలో కీలక ముందడుగు: హైదరాబాద్లో టెస్టింగ్ లాబరేటరీ!
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు అనేక బయోటెక్ కంపెనీలు వాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో మన హైదరాబాద్ కంపెనీలు కూడా ఉన్నాయి. దీంతో ప్రపంచానికి కరోనా వాక్సిన్ అందించే ప్రక్రియలో మన కంపెనీలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈ దిశగా మరో కీలక ముందడుగు పడింది.
ఫార్మా, బయోటెక్ కంపెనీలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లో దేశంలోనే రెండో వాక్సిన్ టెస్టింగ్ లాబరేటరీ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామా రావు వెల్లడించారు. ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ది టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక వెబినార్ లో పాల్గొన్న మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.
హైదరాబాద్ లో వాక్సిన్ టెస్టింగ్ లాబరేటరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని అయన చెప్పారు. దీంతో ఇకపై కరోనా వైరస్ వాక్సిన్ పరిశోధనలు మరింత జోరుగా సాగనున్నాయి. వాక్సిన్ టెస్టింగ్ లో వేగం గణనీయంగా పెరగనుంది. ఇదే జరిగితే వాక్సిన్ అందుబాటులోకి రావటానికి పట్టే సమయం మరింత తగ్గే అవకాశాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
జీనోమ్ వాలీ లో ఏర్పాటు...
హైదరాబాద్ లోని ప్రముఖ బయోటెక్, లైఫ్ సైన్సెస్ హబ్ అయిన జీనోమ్ వాలీ లోనే వాక్సిన్ టెస్టింగ్ లాబరేటరీ ఏర్పాటు కానుంది. ఈ లాబరేటరీ ఏడాది లోపే తన సేవలు అందించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు దేశంలో ఒకే ఒక్క వాక్సిన్ టెస్టింగ్ లాబరేటరీ ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలి అనే ఒక చిన్న పట్టణంలో ఉంది.
సెంట్రల్ డ్రగ్స్ లాబరేటరీ (సిడీఎల్) గా పిలిచే ఈ కేంద్రానికే ఇప్పటి వరకు వాక్సిన్ కంపెనీలు తమ వాక్సిన్ బ్యాచ్ లను పంపించాల్సి వస్తోంది. ప్రతి బ్యాచ్ వాక్సిన్ ను అక్కడ టెస్ట్ చేసిన తర్వాతే దానికి అనుమతిస్తారు. దేశం మొత్తం మీద ఒకే టెస్టింగ్ లాబరేటరీ కావటం, ఇక్కడి నుంచి అంత దూరం వాక్సిన్ బ్యాచ్ లను సురక్షితంగా తరలించటం వంటి కారణాలతో పరిశోధనలు ఆలస్యం అవుతున్నాయి. అలా కాకుండా, ఇప్పుడు హైదరాబాద్ లోనే ఈ లాబరేటరీ ఉండటం వల్ల టెస్టింగ్ లో వేగం, లాజిస్టిక్స్ వంటి అంశాలు కలిసివస్తాయి.
అందుకే ఇక్కడ...
ప్రస్తుతం కరోనా వైరస్ కు వాక్సిన్ అభివృద్ధి చేయటం కోసం అనేక భారతీయ వాక్సిన్ కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇందులో పూణే కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ చాలా ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. అలాగే మన హైదరాబాద్ నుంచి కూడా భారత్ బయోటెక్ కంపెనీ వేగంగా వాక్సిన్ అభివృద్ధికి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
అలాగే బయోలాజికల్ ఈ, ఇండియన్ ఇమ్మ్యూనోలోజికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు కూడా ఈ రేసులో ఉన్నాయి. మరో వైపు శాంతా బయోటెక్ (ప్రస్తుతం సనోఫీ) వంటి ప్రముఖ వాక్సిన్ కంపెనీలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇటీవలే బెంగళూరు కు చెందిన బయోకాన్ అనుబంధ కంపెనీ సింజీన్ కూడా ఇక్కడ పరిశోధన & అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దీంతో దేశంలోనే హైదరాబాద్ వాక్సిన్ కాపిటల్ గా అవతరించింది. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే... హైదరాబాద్ లో వాక్సిన్ టెస్టింగ్ లాబరేటరీ ఏర్పాటుకు కేంద్రం అనుమతించినట్లు తెలిసింది.
మూడో వంతు మన వాక్సిన్ లే...
ఫార్మా, బయోటెక్ రంగంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే .. ప్రపంచంలో వినియోగించే మొత్తం వాక్సిన్ లలో మూడో వంతు (33%) వాక్సిన్ లు మన దగ్గరే తయారవుతాయి. అలాగే, అంతే మొత్తంలో వాటిని ప్రపంచానికి ఎగుమతి చేస్తాం. అంటే ప్రపంచంలో ప్రతి ముగ్గురు వాక్సిన్ వేసుకునే వారిలో ఒకరు తప్పకుండా హైదరాబాద్ లో తయారైన వాక్సిన్ నే తీసుకుంటారని చెప్పొచ్చు.
మన దగ్గర నుంచి అభివృద్ధి చెందిన అమెరికా, యూరోప్ దేశాలకే కాకుండా ఆఫ్రికా, గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున వాక్సిన్లు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ప్రపంచమంతా మనం తయారు చేసిన వాక్సిన్ల సహాయంతో ఆరోగ్యంగా ఉంటోంది. అలాగే ఇకపై మన హైదరాబాద్ నుంచే కరోనా వైరస్ వాక్సిన్ కూడా రావాలని, అది ప్రపంచ మానవాళిని కాపాడాలని కోరుకుందాం.