Keshub Mahindra: ఆనంద్ మహీంద్రా మేనమామ కేషుబ్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా ఎమెరిటస్ ఛైర్మన్ తన 99వ ఏట కన్నుమూశారు. ఇటీవల ఫోర్బ్స్ జాబితా ప్రకారం 1.2 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతీయ అత్యంత వృద్ధ బిలియనీర్గా నిలిచారు.
కేషుబ్ మహీంద్రా 1947లో మహీంద్రా గ్రూప్ లో చేరారు. ఆ తర్వాత 1963 నుంచి 2012 వరకు ముంబై-లిస్టెడ్ సమ్మేళనానికి ఛైర్మన్గా 48 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలందించారు. ఆయన పదవీ విరమణ తర్వాత తన వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రాను నియమించారు.

మహీంద్రా కంపెనీని భారతదేశంలోని విల్లీస్ జీప్ల అసెంబ్లర్ నుంచి విభిన్నమైన సమ్మేళనంగా మార్చింది. 19 బిలియన్ డాలర్ల విలువైన మహీంద్రా గ్రూప్ ట్రాక్టర్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు మాత్రమే కాకుండా, సాఫ్ట్వేర్ సేవలు, హాస్పిటాలిటీ, డిఫెన్స్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది.
కేషుబ్ మహీంద్రా పరోపకారి. దేశంలో నైతిక సంస్థలను నిర్మించడంలో దోహదపడ్డారు. అనేక ప్రతిష్టాత్మక సంస్థలు, కమిటీల్లో భాగమై తనవంతు సేవలను అందించారు. కంపెనీ లా & MRTPపై సచార్ కమిషన్, పరిశ్రమల సెంట్రల్ అడ్వైజరీ కౌన్సిల్ వంటి కమిటీల్లో పనిచేయడానికి ఆయనను ప్రభుత్వం నియమించింది. 2004-2010 మధ్య కాలంలో న్యూ ఢిల్లీలోని వాణిజ్యం & పరిశ్రమల ప్రధాన మంత్రి మండలిలో సభ్యుడిగా ఉన్నారు.
ఆయన సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, ఐఎఫ్సీ, ఐసీఐసీఐతో సహా ప్రైవేట్ అండ్ పబ్లిక్ డొమైన్లో అనేక బోర్డులు, కౌన్సిల్లలో కూడా పనిచేశారు. పరిశ్రమకు చేసిన కృషిని గుర్తించిన ఫ్రెంచ్ ప్రభుత్వం 1987లో అవార్డుతో సత్కరించింది.


Click it and Unblock the Notifications