రూ.63,000 వరకు పెరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల ధరలు
మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 14, 2022 నుండి తమ వాహనాలపై 2.5 శాతం మేర ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలు మోడల్స్, వేరియంట్ను బట్టి రూ.10,000 నుండి రూ.63,000కు పెరగనున్నాయి. వాహనాల ధరలు పెంచుతున్నట్లు గురువారం ఎక్స్చేంజీకి తెలిపింది.
స్టీల్, అల్యూమినియం, పల్లాడియం తదితర ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. పెరిగిన ముడి సరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, ఈ క్రమంలో ధరల సవరణ చేపట్టినట్లు తెలిపింది.
ఇతర ఓఈఎంల విషయానికి వస్తే మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ సీవీ సెగ్మెంట్, హీరో మోటో కార్ప్, సుజుకీ మోటార్ సైకిల్, ఆడి, బీఎండబ్ల్యు తదితర వాహనాల ధరలు పెరిగాయి. గత కొద్ది నెలలుగా కార్ మేకర్స్ రామెటీరియల్ ఖర్చు 75 శాతం నుండి 78 శాతం మేర పెరిగినట్లు చెబుతున్నారు.