Telangana: మహీంద్రా కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్.. భారీ పెట్టుబడి..
Mahindra EV: ప్రపంచ వేగాన్ని అందుకోవటంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోని చాలా రాష్ట్రాల కంటే ముందుగా ఉంది. ఒకప్పుడు కేవటం ఐటీ సేవల పరిశ్రమకు మాత్రమే డెస్టినేషన్ గా ఉన్న తెలంగాణ ప్రస్తుతం ఇతర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను అన్ లాక్ చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తోంది.
తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సైతం తెలంగాణలో తన పరిశ్రమను పెట్టేందుకు ముందుకొచ్చింది. మెదక్ జిల్లాలోని జహీరాబాద్లోని ప్రస్తుత తయారీ కేంద్రం విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో మహీంద్రా గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రస్తుత జహీరాబాద్ ప్లాంట్లో లాస్ట్ మైల్ మొబిలిటీ వ్యాపారానికి సంబంధించిన ఎలక్ట్రిక్ మూడు చక్రాలు, నాలుగు చక్రాల వాహనాలను తయారు చేయాలని భావిస్తోంది. అభివృద్ధితో పాటు అక్కడే ఉత్పత్తికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు బీఎస్ఈకి వాహన తయారీ సంస్థ వెల్లడించింది.

ప్రతిపాదిత విస్తరణ కోసం కంపెనీ రానున్న 8 ఏళ్లలో దాదాపు రూ.1,000 కోట్లను వెచ్చించాలని నిర్ణయించింది. ఈ ఒప్పందం తెలంగాణ ప్రభుత్వ EV ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద మెగా ప్రాజెక్టుల కేటగిరీ కిందకు వస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి KTR సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో MOU చేసుకున్నారు. దీని ద్వారా రానున్న కాలంలో వందల సంఖ్యలో కొత్త ఉద్యోగాలకు అవకాశం లభిస్తుందని తెలుస్తోంది.

దేశంలో సస్టెయినబుల్ మొబిలిటీ రంగాన్ని మరింత వృద్ధిపరిచే క్రమంలో తెలంగాణ తనవంతు పాత్ర పోషిస్తోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నేడు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు.

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న నాలుగు మెగా ఈవీ తయారీ క్లస్టర్లలో జహీరాబాద్ ఒకటని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మహీంద్రా కంపెనీకి అవసరమైన అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని వెల్లడించారు.


Click it and Unblock the Notifications


