Mahindra Airtel: జట్టు కట్టిన ఎయిర్ టెల్ మహీంద్రా గ్రూప్స్.. తయారీలో 5జీ సాంకేతికత..
Mahindra Airtel: మారుతున్న సాంకేతికతలను టెలికాం రంగంలో ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టడంలో ఎయిర్ టెల్ వేగంగా ఉంటుంది. అలాగే నయా టెక్నాలజీలను తన వ్యాపారంలో భాగం చేయటంలో దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు చెందిన మహీంద్రా గ్రూప్ కూడా చురుకుగా ఉంటుంది. ఈ క్రమంలోనే 5G సాంకేతికతను మహీంద్రా తన వాహన తయారీ వ్యాపారానికి జోడించారు.
టెక్ మహీంద్రాతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో మహీంద్రా చకాన్ వాహన తయారీ కర్మాగారంలో ప్రైవేట్ 5G నెట్వర్క్ను ఏర్పాటు చేసినట్లు భారతీ ఎయిర్టెల్ గురువారం తెలిపింది. దీంతో చకాన్ యూనిట్ దేశంలో మొట్టమొదటి 5G- ఎనేబుల్డ్ ఆటోమొబైల్ తయారీ యూనిట్గా అవతరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. దీని ఫలితంగా సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్ కోసం మెరుగైన వేగం పెరిగిందని, అన్ని వాహనాల పంపకాల కోసం కీలకమైన ఆపరేషన్ అని ఎయిర్ టెల్ వెల్లడించింది.
ఎయిర్ టెల్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ నెట్ వర్క్ పూర్తిగా ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ విజన్-బేస్డ్ ఇన్స్పెక్షన్ కోసం ఉపయోగించబడుతోంది. దీని ఫలితంగా పెయింట్ నాణ్యత మెరుగుపడుతుందని వెల్లడించింది. దీనికి ముందు ఎయిర్ టెల్ జూలైలో బెంగళూరులోని బాష్ ఫెసిలిటీలో ప్రైవేట్ 5G నెట్వర్క్ను విజయవంతంగా పరీక్షించింది. మహీంద్రా గ్రూప్ తమతో భాగస్వామిగా మారటంపై ఎయిర్టెల్ బిజినెస్ డైరెక్టర్, CEO అజయ్ చిట్కారా సంతోషం వ్యక్తం చేశారు. 5జీ వేగం ఫ్యాక్టరీలో తయారీ వేగాన్ని, పనితీరును మెరుగుపడుతుందని ఆయన అన్నారు.
సిస్టమ్ ఇంటిగ్రేషన్, ప్లానింగ్, డిజైనింగ్, విస్తరణ, ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్ల నిర్వహణలో టెక్ మహీంద్రా నైపుణ్యంతో దాని కనెక్టివిటీ పోర్ట్ఫోలియో ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలుస్తోంది. దీనికి తోడు వ్యాపారం రంగంలోని ఎంటర్ప్రైజులతో పాటు వినియోగదారులు 5జీ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకునేందుకు తాజా చర్య ఉపకరిస్తుందని ఎయిర్ టెల్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.