కేంద్రం బాటలో మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ: పెట్రోల్పై వ్యాట్ తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 తగ్గించి, వాహన వినియోగదారులకు మోడీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ధర తగ్గింపుపై నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. దీంతో పెట్రోల్ ధర రూ.9.50, డీజిల్ ధర రూ.7 తగ్గింది. రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి, ధరలు తగ్గించాలని పరిశ్రమ నుండి మొదలు సామాన్యుల వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాలు తగ్గింపు బాట పట్టాయి.
పెట్రోల్, డీజిల్ పైన కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయాన్ని భారత కార్పోరేట్ వర్గాలు, ట్రేడర్లు, ఎగుమతిదారులు స్వాగతించారు. రాష్ట్రాలు కూడా సుంకాలను తగ్గించి కస్టమర్లకు మరింత ఉపశమనం అందించాలని కోరారు. ఇంధన ధరలు తగ్గితే సరుకు రవాణా వ్యయాలు తగ్గి ద్రవ్యోల్భణం అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. ఇంధనంపై ఎక్సైజ్ సుంకం కోత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందని, తద్వారా సామాన్యుడిపై భారం తగ్గుతుందని, ప్రభుత్వం ఆలోచన మంచిదని తెలిపారు. దీనికి తోడు పలు రంగాల కంపెనీలకు ముడి వ్యయాలు తగ్గుతాయని చెబుతున్నారు.
కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ఇది రెండోసారి. దీంతో కొన్ని రాష్ట్రాలు కూడా తగ్గిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ వ్యాట్ను తగ్గించాయి. లీటర్ పెట్రోల్ పైన రూ.2.08, డీజిల్ పైన రూ.1.44 తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. పెట్రోల్ పైన రూ.2.48, డీజిల్ పైన రూ.1.16 తగ్గిస్తున్నట్లు రాజస్థాన్, పెట్రోల్ పైన రూ.2.41, డీజిల్ పైన రూ.1.36 తగ్గిస్తున్నట్లు కేరళ ప్రకటించింది.