Made in India: రికార్డు సృష్టించిన మేడిన్ ఇన్ ఇండియా టీవీలు
Made in India TVs: గత సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో 'మేడ్ ఇన్ ఇండియా' టీవీల అమ్మకాలు దూసుకు పోయినట్లు 'కౌంటర్ పాయింట్' సంస్థ తెలిపింది. 2022లో మూడవ త్రైమాసికానికిగాను 33 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. డిక్సన్ టెక్నాలజీస్ అగ్రగామిగా నిలవగా.. రేడియంట్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించడంతో.. దేశీయ తయారీ రంగం మంచి వృద్ధిని నమోదు చేస్తున్నట్లు అభిప్రాయపడింది. కానీ ఇదే సమయంలో 'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 8 శాతం మేర మందగించాయి.
పండుగ సీజన్ కావడంతో వినియోగదారుల నుంచి కొనుగోళ్లు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. టాప్ 5 కంపెనీలే 50% మార్కెట్ వాటాను ఆక్రమించాయి. దేశీయ తయారీ రంగం కూడా.. స్మార్ట్ వాచ్లు, ఇయర్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ వైపు మెగ్గుచూపాయి. గత త్రైమాసికంలో 16% ఉన్న అమ్మకాల వృద్ధి రేటు ఇప్పుడు 34 శాతానికి చేరుకోవడం శుభపరిణామం.
మేడిన్ ఇండియా ద్వారా కేవలం టీవీలు, స్మార్ట్ వాచ్లకు మాత్రమే పరిమితం కాకుండా.. పలు ఇతర ఉత్పత్తుల తయారీలోనూ స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశం ముందడుగు వేస్తోంది. అంతర్జాతీయ విపణిలో మెజారిటీ భాగస్వామ్యాన్ని చేజిక్కునేందుకు మెల్లగా బాటలు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల విషయమై సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. గుజరాత్ సహా పలు రాష్ట్రాలు వాటి తయారీ కోసం పాలసీలు రూపొందిస్తుండటం హర్షించదగ్గ విషయం.