హైదరాబాద్లో ఈ ఏరియాలో లగ్జరీ హౌస్ కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. బెంగళూరు, చైన్నై వద్దనుకుని మరీ..
దేశంలో లగ్జరీ హౌస్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఈ రంగంలో దక్షిణాది రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. తాజాగా ప్రాపర్టీ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్తో భాగస్వామ్యంతో ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ రూపొందించిన 'సదరన్ ఇండియా హై-ఎండ్ లగ్జరీ హౌసింగ్' నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (FY26) లో దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన వృద్ధిని కనబరిచింది.
ఈ నగరాల్లో రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన మొత్తం 811 అత్యంత విలాసవంతమైన (Ultra-Luxury) గృహాలు అమ్ముడయ్యాయి. వీటి మొత్తం లావాదేవీల విలువ ఏకంగా రూ.11,246 కోట్లకు చేరుకోవడం.. దేశీయ ప్రీమియం గృహ విభాగంలో నెలకొన్న బలమైన డిమాండ్ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

ఈ మూడు అగ్రశ్రేణి మార్కెట్లలో విలాసవంతమైన గృహాల అమ్మకాల పరిమాణంలో హైదరాబాద్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్త బెంచ్మార్క్ను నెలకొల్పింది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క హైదరాబాద్లోనే రూ. 8,562 కోట్ల భారీ విలువైన 625 అల్ట్రా-లగ్జరీ గృహాలు అమ్ముడయ్యాయి. దీనితో పోలిస్తే ఐటీ రాజధాని బెంగళూరులో రూ. 1,957 కోట్ల విలువైన 128 విలాసవంతమైన గృహాల అమ్మకాలు జరగగా.. చెన్నైలో రూ. 727 కోట్ల విలువైన 58 లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి.
ఈ మూడు నగరాల్లో స్థిరాస్తి ధరల వ్యత్యాసాలను, కొనుగోలుదారులకు లభించే స్థల-విలువ నిష్పత్తిని (Space-to-Value Ratio) కూడా ఈ నివేదిక ఆసక్తికరంగా విశ్లేషించింది. ఒక కొనుగోలుదారు రూ. 10 కోట్ల బడ్జెట్తో హైదరాబాద్లో సుమారు 6,210 చదరపు అడుగుల (Sq.Ft) కమర్షియల్ ఇళ్లను సొంతం చేసుకోగలుగుతుండగా.. చెన్నైలో 4,290 చదరపు అడుగులు, బెంగళూరులో కేవలం 3,930 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మాత్రమే పొందగలుగుతున్నారు. దీనిని బట్టి హైదరాబాద్లో లగ్జరీ ఇళ్లకు మెరుగైన స్థల నిష్పత్తి లభిస్తోందని స్పష్టమవుతోంది.
ఈ పరిణామాలపై ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ సీఈఓ అశ్విన్ చద్దా స్పందిస్తూ.. దక్షిణ భారతదేశంలోని విలాసవంతమైన గృహాల రంగం మూడు విభిన్న మార్కెట్ల ద్వారా రూపుదిద్దుకుందని అభిప్రాయపడ్డారు. భారీ లావాదేవీల పరంగా హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తుండగా, బెంగళూరులో స్వల్పకాలిక వృద్ధి సామర్థ్యం అత్యంత బలంగా ఉందని, మరోవైపు చెన్నై తన చిరకాల సాంప్రదాయ ప్రీమియం ప్రాంతాల ద్వారా స్థిరంగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
దక్షిణ భారత లగ్జరీ నివాస మార్కెట్ ఒక కీలకమైన మలుపుకు చేరుకుందని సీఆర్ఈ మ్యాట్రిక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా పేర్కొన్నారు. మెరుగైన స్థల-విలువ నిష్పత్తులు, పెద్ద ఇళ్లకు ఉన్న నిరంతర ఆదరణే హైదరాబాద్ ఆధిపత్యానికి బలమైన పునాది అని ఆయన విశ్లేషించారు. బెంగళూరులోని ట్రెండ్స్ గమనిస్తే ప్రీమియం గృహాలు ఇకపై కేవలం సాంప్రదాయ ఉన్నత ప్రాంతాలకే పరిమితం కావడం లేదని స్పష్టమవుతోందన్నారు.
అందువల్ల ఇన్వెస్టర్లు ఈ విలాసవంతమైన గృహాల విభాగాన్ని అన్ని చోట్లా ఒకేలా పరిగణించకుండా, ప్రతి నగరానికి అనుగుణంగా ప్రత్యేక పెట్టుబడి వ్యూహాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. కాగా, అల్ట్రా-ప్రీమియం నివాసాల అభివృద్ధికి ప్రస్తుతం హైదరాబాద్లోని కోకాపేట్, బెంగళూరులోని రాజనుకుంటే ప్రాంతాలు అత్యంత ప్రముఖ మైక్రో-మార్కెట్లుగా (Micro-markets) ఎదుగుతున్నట్లు ఈ నివేదిక గుర్తించింది.


Click it and Unblock the Notifications
