LPG cylinder price hike: వంట గ్యాస్ ధర మరింత భారం
వంటింట్లో గ్యాస్ ధర సామాన్యులకు మరింత భారంగా మారుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. ఇదే సమయంలో గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. న్యూయార్క్ ఫ్యూచర్ మార్కెట్లో క్రూడ్ ఫ్యూచర్ ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.
మరోవైపు చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని అప్పుడే వేగవంతం చేసే ఆలోచనలో లేవు. మరోవైపు అంతర్జాతీయంగా కరోనా ప్రభావం తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని, చమురు డిమాండ్ పెరుగుతోంది. చమురు డిమాండ్ పెరగడం దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, గ్యాస్ ధర పెరుగుదలకు కారణమైంది.
రెండు నెలల్లో నాలుగోసారి
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో వంట గ్యాస్ ధరలన పెంచుతున్నట్లు దేశీయ చమురు రంగ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.15 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెంచిన ధరలు ఈరోజు (అక్టోబర్ 6, బుధవారం) నుండి అమలులోకి వచ్చినట్లు ప్రకటించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.899.50కి చేరుకుంది.
రెండు నెలల కాలంలో వంట గ్యాస్ ధరను పెంచడం నాలుగోసారి. సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీన, 15వ తేదీన గ్యాస్ ధరలను చమురు సంస్థలు సమీక్షిస్తాయి. కానీ అక్టోబర్ ఒకటవ తేదీన కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచగా, కాస్త ఆలస్యంగా నేడు వంట గ్యాస్ ధరలను సవరించాయి. 2021లో వంట గ్యాస్ సిలిండర్ పైన రూ.205 పెరిగింది. 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.899.50, 5 కిలోల కొత్త సిలిండర్ ధర రూ.502గా ఉంటుంది.
హైదరాబాద్లో ఎంతంటే
ఇంతకుముందు 14.2 కిలోల నాన్-సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.884.50గా ఉంది. ఇప్పుడు రూ.15 పెరిగి రూ.899.50కి చేరుకుంది. కోల్కతాలో రూ.911 నుండి రూ.926, ముంబైలో రూ.884.50 నుండి రూ.899.50, చెన్నైలో రూ.900.50 నుండి రూ.915.50కి పెరిగింది.
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.952.00కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82.53 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 78.87 డాలర్లకు పెరిగింది. 2014 తర్వాత ఈ ధరలు ఇవే గరిష్టం. వరుసగా ఐదు సెషన్లు పెరిగాయి.
పెట్రోల్ డీజిల్ ధరలు కూడా
పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. నేటితో వరుసగా రెండో రోజు పెరిగాయి. బుధవారం లీటర్ పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగి, సరికొత్త గరిష్ఠాలను తాకాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.94, డీజిల్ ధర రూ.91.42కు చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.96, డీజిల్ ధర రూ.99.17గా ఉంది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.107.09, డీజిల్ రూ.99.75గా ఉంది.