ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వేని వెంటాడుతున్న గ్యాస్ కొరత.. ఎలక్ట్రిక్ కుకింగ్ వంట ప్రారంభించిన IRCTC..
పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం)లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా దేశంలో వాణిజ్య ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితమే భద్రతా కారణాల దృష్ట్యా దశలవారీగా నిలిపివేసిన 'కదులుతున్న రైళ్లలో వంట వండే పద్ధతి'ని ఐఆర్సీటీసీ మళ్లీ ప్రారంభించాల్సి వచ్చింది. అయితే ఈసారి పాత పద్ధతిలో కాకుండా పూర్తిగా అత్యాధునిక ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లను (Electric Induction Stoves) ఉపయోగించి రైళ్లలోనే ఆహారాన్ని తయారు చేస్తున్నారు.
జాతీయ రైల్వే టికెటింగ్ , క్యాటరింగ్ సంస్థ అయిన ఐఆర్సీటీసీ, ప్రతిరోజూ దాదాపు 17 లక్షల భోజనాలను దేశవ్యాప్తంగా 1,400 రైళ్లలో సరఫరా చేస్తోంది. ఈ భారీ ఆహార సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరాయంగా కొనసాగించడానికి, విద్యుత్తో నడిచే 'లింకే హాఫ్మన్ బుష్' (LHB) ప్యాంట్రీ కార్లలో వంట చేయడానికి మొగ్గు చూపింది. రాజధాని, శతాబ్ది, దురంతో , వందే భారత్ వంటి దేశంలోని అత్యంత ప్రీమియం రైళ్లన్నీ ఈ ఎల్హెచ్బీ (LHB) కోచ్లతోనే నడుస్తుండటం గమనార్హం.

ఐఆర్సీటీసీ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ స్పందిస్తూ, "ఇప్పటికే భద్రతా సౌకర్యాలు ఉన్న ప్యాంట్రీ కార్లలో విద్యుత్ ఆధారంగా వంట చేయడానికి మేము మా వెండర్లను అనుమతించాము. దీనివల్ల మన ఎల్హెచ్బీ ప్యాంట్రీ కార్లన్నీ రైలు ప్రయాణంలోనే సురక్షితంగా భోజనాన్ని తయారు చేయగలుగుతున్నాయి. అలాగే, పెద్ద రైల్వే స్టేషన్లలో ఇండక్షన్ వంట కోసం విద్యుత్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాము. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL) , హెచ్పీసీఎల్ (HPCL) సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాము" అని తెలిపారు.
రైల్వే అధికారుల లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న ఐఆర్సీటీసీ క్లస్టర్ కిచెన్లు, బేస్ కిచెన్లు , క్యాటరింగ్ విభాగాల నిర్వహణకు ప్రతిరోజూ సుమారు 1,000 వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అవసరమవుతాయి. ప్రస్తుత గ్యాస్ కొరత దృష్ట్యా, స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్మెంట్ రూమ్లు , 'జన్ ఆహార్' అవుట్లెట్ల నిర్వాహకులు కూడా ఇకపై ఇండక్షన్ కుక్కర్లు, మైక్రోవేవ్ ఓవెన్లకు మారాలని ఐఆర్సీటీసీ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ విప్లవాత్మక మార్పుతో రైల్వే కిచెన్లలో జరిగే మొత్తం ఆహార తయారీలో సుమారు 60 శాతం వంట ప్రక్రియ చివరికి ఎలక్ట్రిక్ వంట విధానంలోకి మారిపోనుంది.
అంతర్జాతీయంగా తలెత్తిన ఈ ఇంధన అంతరాయం ఐఆర్సీటీసీ ఆర్థిక వ్యవస్థను గట్టిగా దెబ్బతీసింది. ముడిసరుకు , గ్యాస్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో, 2025-26 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (Q4) కంపెనీ క్యాటరింగ్ విభాగం యొక్క వడ్డీ , పన్నులకు ముందు ఆదాయాల (EBIT) మార్జిన్ 10.4 శాతం నుండి ఏకంగా 6.3 శాతానికి పడిపోయింది. ఈ పరిణామాలపై మార్కెట్ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైకి చెందిన ఒక ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు మాట్లాడుతూ.. రైల్వేలో క్యాటరింగ్ ధరలను చివరిసారిగా 2019లో సవరించారు.
ఇప్పుడు గ్యాస్ ధరలు పెరగడం వల్ల లైసెన్స్దారులు ముడిసరుకు భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ఐఆర్సీటీసీ తన మార్జిన్లను కాపాడుకోవాలంటే తక్షణమే ఆహార ధరలను (టారిఫ్) పెంచడం లేదా స్థిరమైన అమ్మకాల వృద్ధిని సాధించడం చాలా అవసరం" అని అభిప్రాయపడ్డారు. అయితే, క్యాటరింగ్ ధరల సవరణ అనేది పూర్తిగా రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని చెబుతూ, ధరల పెంపు అవకాశంపై వ్యాఖ్యానించడానికి సీఎండీ సంజయ్ కుమార్ జైన్ నిరాకరించారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, పశ్చిమ ఆసియా నుండి చమురు , గ్యాస్ ఎగుమతులకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ షిప్పింగ్ మార్గమైన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) ద్వారా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దీనివల్లే భారతదేశానికి ఇంధన సరఫరా తగ్గి దేశీయంగా కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సంక్షోభం రైల్వే క్యాటరింగ్ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపాన్ని కూడా బహిర్గతం చేసింది. అధికారిక పార్లమెంటరీ డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా నడుస్తున్న రైళ్లలో ఇప్పటికీ ఏకంగా 341 రైళ్లలో ప్రయాణికులకు ప్యాంట్రీ కార్ సర్వీస్ సౌకర్యాలు ఏమాత్రం లేవని వెల్లడైంది.


Click it and Unblock the Notifications
