దేశ ఇంధన మార్కెట్లో మారుతున్న ట్రెండ్లు..పెట్రోల్కు పెరుగుతున్న డిమాండ్.. మరి LPG వినియోగం ఎందుకు తగ్గింది?
పెట్రోలియం ప్లానింగ్ & అనాలిసిస్ సెల్ (PPAC) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశ ఇంధన వినియోగ సరళిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ డిమాండ్-నిర్వహణ చర్యలు, రికార్డు స్థాయికి చేరిన వాణిజ్య ఎల్పీజీ (LPG) ధరల నేపథ్యంలో దేశంలో డీజిల్ వృద్ధి రేటును పెట్రోల్ డిమాండ్ వెనక్కి నెట్టింది. మే నెలలో ఎల్పీజీ వినియోగం గతేడాదితో పోలిస్తే ఏకంగా 503 వేల మెట్రిక్ టన్నులు (TMT) లేదా 19.16% మేర భారీగా క్షీణించి 2.12 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రధాన పెట్రోలియం ఉత్పత్తులన్నింటిలోనూ ఎల్పీజీ విభాగంలోనే అత్యంత తీవ్రమైన క్షీణత నమోదు కావడం గమనార్హం.
పీపీఏసీ డేటా ప్రకారం.. మే 2024లో 2,456 TMTగా ఉన్న ఎల్పీజీ వినియోగం, మే 2025లో 2,622 TMTకి పెరగ్గా, మే 2026 నాటికి 2,119 TMTకి పడిపోయింది. మే 2024తో పోల్చినా కూడా ఈ డిమాండ్ 13.71% తక్కువగా నమోదై, ఆ నెలలో అత్యంత బలహీనమైన ప్రదర్శన కనబరిచిన ఇంధనంగా నిలిచింది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా చమురు దిగుమతులకు ఆటంకాలు ఏర్పడటంతో, ప్రభుత్వం వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను నియంత్రించడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణమైంది. డీఏసీ ఆధారిత నియంత్రణలు, గ్యాస్ బుకింగ్ వ్యవధులపై ఆంక్షలు విధించడం, పెరిగిన ధరల వల్ల కొంతమంది వినియోగదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపడం వల్ల ఈ క్షీణత తప్పలేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

దీనికి భిన్నంగా పెట్రోల్ వినియోగం దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. మే 2024లో 3,463 TMT, మే 2025లో 3,782 TMTగా ఉన్న పెట్రోల్ డిమాండ్, మే 2026లో 3,888 TMTకి చేరింది. ఇది గత ఏడాది కంటే 2.8%, మే 2024తో పోలిస్తే 12.28% అధికం. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే డీజిల్తో పోలిస్తే పెట్రోల్ వినియోగ వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. డీజిల్ వినియోగం మే 2024లో 8,412 TMT నుండి మే 2025లో 8,592 TMTకి, అక్కడి నుండి మే 2026 నాటికి 8,674 TMTకి (వార్షికంగా 0.95% వృద్ధి) పెరిగింది. మరోవైపు, విమానయాన ఇంధనం (ATF) డిమాండ్ మే 2026లో 770 TMTగా నమోదై, వార్షిక ప్రాతిపదికన 0.78% స్వల్ప క్షీణతను చవిచూసింది.
ఆర్థిక సంవత్సరం 2026-27 (FY27) మొదటి రెండు నెలల (ఏప్రిల్-మే) సంచిత గణాంకాలను పరిశీలిస్తే ఈ వ్యత్యాసం మరింత స్పష్టమవుతుంది. ఈ రెండు నెలల కాలంలో పెట్రోల్ వినియోగం 4.5% పెరిగి 7,557 TMTకి చేరగా, డీజిల్ డిమాండ్ కేవలం 0.61% వృద్ధిని మాత్రమే నమోదు చేసుకుని 16,956 TMTగా ఉంది. ఇక సంచిత ప్రాతిపదికన కూడా ఎల్పీజీ అత్యంత పేలవమైన ప్రదర్శనను ఇచ్చింది. గతేడాది ఏప్రిల్-మే కాలంలోని 5,226 TMTతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఎల్పీజీ వినియోగం 17.54% తగ్గి 4,310 TMTకి పడిపోయింది.
ఇదిలా ఉండగా, గత ఆర్థిక సంవత్సరం (FY26) లో భారతదేశ మొత్తం ఎగుమతుల బుట్టలో పెట్రోలియం రంగం వాటా కూడా బలహీనపడింది. దేశ స్థూల ఎగుమతులలో పెట్రోలియం ఉత్పత్తుల వాటా FY24లో 10.9%, FY25లో 10.1% ఉండగా, FY26లో తాత్కాలికంగా 8.8 శాతానికి పడిపోయింది. కోవిడ్ ప్రభావం ఉన్న FY21 కాలం మినహాయిస్తే, గత దశాబ్ద కాలంలో ఇదే అత్యల్ప వాటా కావడం గమనార్హం. డీజిల్ మరియు విమానయాన ఇంధనం (ATF) ఎగుమతులు భారీగా తగ్గడమే దీనికి ప్రధాన కారణం. గతేడాది డీజిల్ ఎగుమతులు 2.5% తగ్గి 27.32 మిలియన్ టన్నులకు పరిమితమవగా (వరుసగా మూడేళ్ల క్షీణత), ఏటీఎఫ్ (ATF) ఎగుమతులు ఏకంగా 20.35% మేర పడిపోయి 6.81 మిలియన్ టన్నులకు చేరాయని పీపీఏసీ నివేదిక వెల్లడించింది.


Click it and Unblock the Notifications
