బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల అష్టకష్టాలు.. బయటకు వస్తే క్యాబ్ దొరకక నానా తంటాలు..కారణం ఏంటంటే..
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న క్యాబ్ల కొరత సమస్య ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. విమానాశ్రయ ప్రాంగణంలో ఉబెర్, ఓలా వంటి యాప్ ఆధారిత అగ్రిగేటర్ల కోసం ప్రత్యేక పికప్ కియోస్క్లు ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా అక్కడ వాహనాలు దొరకడం గగనమైపోతోంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఈ పరిస్థితిని మరింత దిగజార్చాయి. Bengaluru విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సి వస్తోంది. కేవలం ఐదు నిమిషాల్లో క్యాబ్ వస్తుందని సిబ్బంది హామీ ఇస్తున్నప్పటికీ, వాస్తవానికి 30 నిమిషాలు దాటినా వాహనాలు రాకపోవడంతో, విసిగిపోయిన ప్రయాణికులు విధిలేక అత్యంత ఖరీదైన ఇతర ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయిస్తున్నారు.

ఈ సంక్షోభానికి ప్రధాన కారణం డ్రైవర్లు, అగ్రిగేటర్ కంపెనీల మధ్య నెలకొన్న ఆర్థిక వ్యత్యాసాలేనని స్పష్టమవుతోంది. విమానాశ్రయ అధికారులు వర్షాలు.. ట్రాఫిక్ ఇబ్బందులను సాకుగా చూపుతుంటే, డ్రైవర్లు మాత్రం తమ గోడును మరోలా వెళ్లబోసుకుంటున్నారు. ఓలా, ఉబెర్ వంటి సంస్థలు అన్ని కోతలు పోను విమానాశ్రయం పికప్ల కోసం కిలోమీటరుకు కేవలం రూ. 7 నుండి 8 మాత్రమే ఇస్తున్నాయని, ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని డ్రైవర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
విమానాశ్రయం నుండి ఒక ట్రిప్ వేయడానికి, ట్రాఫిక్లో వేచి ఉండటానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుందని, అంత కష్టపడితే కేవలం రూ. 500 మాత్రమే మిగులుతోందని వారు వాపోతున్నారు. రోజుకు రెండు మూడు ట్రిప్పుల కంటే ఎక్కువ వేయలేని పరిస్థితుల్లో ఈ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దీంతో డ్రైవర్లు ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. విమానాశ్రయ లోపల ఉండే అధికారిక కియోస్క్లలో బుకింగ్లు తీసుకోవడానికి బదులుగా, ఖాళీగా బయటకు వచ్చి టోల్ గేట్ దాటిన తర్వాత వ్యక్తిగత బుకింగ్లు లేదా ఇతర మార్గాల్లో రైడ్లు పొందుతున్నారు.
ఇలా చేయడం వల్ల విమానాశ్రయ లోపల తీసుకునే రైడ్ కంటే రూ. 100 నుండి 200 వరకు అదనపు ఆదాయం లభిస్తోందని డ్రైవర్లు చెబుతున్నారు. కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాకుండా, విమానాశ్రయ ప్రాంగణంలో డ్రైవర్ల పట్ల చూపే వివక్ష కూడా వారిని ఈ సేవల నుండి దూరం చేస్తోంది. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కనీసం నీడ సౌకర్యం కూడా కల్పించకపోవడం, డ్రైవర్లు అక్కడ ఎక్కువ సేపు వేచి ఉండటాన్ని అధికారులు వ్యతిరేకించడం వంటి చర్యలు వారిలో అసహనాన్ని పెంచాయి.
మొత్తంగా చూస్తే.. అగ్రిగేటర్ సంస్థల తక్కువ కమీషన్లు, విమానాశ్రయ అధికారుల నిర్లక్ష్యం, పెరుగుతున్న నిర్వహణ వ్యయాల కారణంగా క్యాబ్ డ్రైవర్లు విమానాశ్రయ పికప్లను బహిష్కరిస్తున్నారు. దీనివల్ల దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోమని సూచిస్తున్నాయే తప్ప, సమస్యకు మూల కారణమైన డ్రైవర్ల వేతనాల అంశాన్ని పరిష్కరించడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో విమానాశ్రయ ప్రయాణం మరింత భారంగా, అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications
