సులభంగా ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్మెంట్, వారికి కాస్త ఊరట
కరోనా మహమ్మారి నేపథ్యంలో క్లెయిమ్స్ సెటిల్మెంట్ నిబంధనలను ఎల్ఐసీ మరింత సరళతరం చేసింది. కరోనా డెత్ క్లెయిమ్స్ సెటిల్మెంట్స్ కోసం మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఇచ్చే మరణ ధృవీకరణ సర్టిఫికెట్లకు ప్రత్యామ్నాయ సర్టిఫికెట్లను అమోదించనున్నట్లు తెలిపింది. ఆసుపత్రులు ఇచ్చే డెత్ సర్టిఫికెట్లు, డిశ్చార్జ్ సమ్మరీ లేదా డెత్ సమ్మరీ సర్టిఫికెట్లను ఆమోదిస్తారు.
అయితే ఈ సర్టిఫికెట్లపై ఎల్ఐసీ క్లాస్ 1 అధికారులు గానీ కనీసం పదేళ్ల సినియారిటీ ఉన్న డెవలప్మెంట్ అధికారులు గానీ కౌంటర్ సంతకం చేయాలి. మృతుని దహనం, ఖననానికి సంబంధించి స్మశాన వాటికల అధికారులు జారీచేసే రిసిప్ట్స్ కలిపి పైపత్రాలను LICకి సమర్పించాలి. ఇతర డెత్ క్లెయిమ్స్ సెటిల్మెంట్స్ కోసమైతే గతంలో వలె ఆయా మున్సిపాలిటీలు ఇచ్చే డెత్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది.
మెచ్యూరిటీ, సర్వైవల్ బెనిఫిట్ సెటిల్మెంట్ క్లెయిమ్స్కు అవసరమైన పత్రాలను ఆయా సర్వీస్ శాఖల్లోనే కాకుండా సమీపంలోని LIC ఆఫీసుల్లో సమర్పించవచ్చు. ఇదిలా ఉండగా మే 10 నుండి ఎల్ఐసీ కార్యాలయాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం గం.5.30 గంటల మధ్య పని చేయనున్నాయి. ప్రతి శనివారం ఎల్ఐసీకి సెలవు రోజు.