LIC: భారీ లాభాలు నమోదు చేసిన ఎల్ఐసీ.. ఆనందంలో ఇన్వెస్టర్లు.. 10 రెట్లు..
LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ తో ముగిసిన రెండవ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ మెరుగైన లాభాలను నమోదు చేసింది. త్రైమాసికానికి స్టాండ్లోన్ నికర లాభం రూ.15,952 కోట్లుగా ప్రకటించింది. గత సంవత్సరం ఇదే సమయంలో లాభం కేవలం రూ.1,433 కోట్లుగా ఉంది.
రెండవ త్రైమాసికంలో నికర ప్రీమియం ఆదాయం 26.6% పెరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరుకుంది. కంపెనీకి పెట్టుబడుల ద్వారా వచ్చే నికర ఆదాయం ఏడాదికి 10% పెరిగి రూ.84,104 కోట్లకు చేరుకుంది. సింగిల్ ప్రీమియం 62% పెరిగి రూ.66,901 కోట్లకు చేరుకుంది.
దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ స్థూల నిరర్థక ఆస్తులు(NPA) సెప్టెంబర్ 30 నాటికి రూ.26,111 కోట్లుగా ఉంది. ఇది ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో రూ.26,619 కోట్లు ఉంది. కొన్ని బ్రోకరేజ్ సంస్థలు గత ఏడాది కంటే ఎల్ఐసీ నికర లాభం గతంలో కంటే పడిపోతుందని వేసిన అంచనాలను కంపెనీ తలకిందులు చేసింది.
కంపెనీ సూపర్ లాభాలను నమోదు చేయటంతో శుక్రవారం స్టాక్ బులిష్ గా క్లోజ్ అయింది. స్టాక్ ధర బీఎస్ఈలో రూ.628.05 వద్ద ఉంది. ఎల్ఐసీ భారీ లాభాలను నమోదు చేయటంతో ఇన్వెస్టర్లు సైతం సంతోషంగా ఉంది. రానున్న కాలంలో ఎల్ఐసీ షేర్ ధర పెరుగుతుందని వారు భావిస్తున్నారు. ఐపీవో లిస్టింగ్ ధర కంటే చాలా తక్కువ రేటుకు షేర్లు ప్రస్తుతం మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి.