LIC Share: ఇన్వెస్టర్లకు కన్నీరు మిగిల్చిన ఎల్ఐసీ.. లక్షల కోట్ల నష్టం.. దీనికి కేంద్రం స్వార్థమే కారణమా..?
LIC Share: దేశంలోని దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఏడాది మార్కెట్లోకి చాలా హైప్ మధ్య ఐపీవోగా వచ్చింది. అయితే ఆరంభంలోనే నష్టాలతో నిరాశపరిచిన ఎల్ఐసీ అదే తీరును కొనసాగిస్తోంది. దీంతో షేర్లను కొనుగోలుచేసిన వారు భారీగా నష్టాలను చూస్తున్నారు. సామాన్య మధ్య తరగతికి చెందిన ఇన్వెస్టర్లు ఎక్కువ మంది ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు కుప్పకూలటంతో పాటు, ఎల్ఐసీ షేర్ల ధర పడిపోవటం వారిలో ఆందోళను పెంచుతోంది.
నిరంతరం క్షీణత..
నెలలు గడుస్తున్నా ఎల్ఐసీ షేర్లు మాత్రం నిరంతరం క్షీణిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎల్ఐసీ ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన వారు రూ.2 లక్షల కోట్లు నష్టపోయినట్లు సమాచారం. దీంతో అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఆదాయం కోసం స్వార్థపూరితంగా ఐపీవోను తీసుకొచ్చిందని.. మార్కెట్ పరిస్థితులను సరిగా అంచనా వేయలేదని విమర్శిస్తున్నారు. అందరూ మంచి అవకాశం మించిపోకమునుపే షేర్లను కొనుక్కోవాలని సూచించటంతో ప్రభుత్వరంగంలోని కంపెనీ అని చాలా మంది పెట్టుబడులను పెట్టారు.
LIC IPO అట్టర్ ఫ్లాప్..
2022లో స్టాక్ మార్కెట్లో అత్యధికంగా చర్చనీయాంశమైన ఎల్ఐసీ ఐపీవో ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురిచేసింది. రూ.949 వద్ద లిస్టింగ్ అయిన షేర్ ప్రస్తుతం దాదాపు 34 శాతం వరకు విలువను కోల్పోయింది. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ షేర్లు దాదాపు రూ.628 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఒక్కో షేరుకు రూ.321ను ఇన్వెస్టర్లు కోల్పోయారు.
రూ.2 లక్షల కోట్ల నష్టం..
లిస్టింగ్ తర్వాత వరుస నష్టాలతో ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.3.98 లక్షల కోట్లకు పడిపోయింది. LIC IPO మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6 లక్షల కోట్లుగా ఉంది. కేవలం కొన్ని నెలల కాలంలోనే మార్కెట్ క్యాప్ రూ.2 లక్షల కోట్లకు పైగా పడిపోయింది.
ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా..?
ఎల్ఐసీ ఐపీవో ద్వారా షేర్లను విక్రయించడంతో ప్రభుత్వం రూ.20,557 కోట్లను సమీకరించింది. ప్రస్తుతం ఇందులో ఇన్వెస్ట్ చేసినవారు భారీగా నష్టపోయారని, దీనికి ప్రభుత్వం పరిష్కారం చూపాలని ఇన్వెస్టర్ల వైపు నుంచి డిమాండ్ పెరిగుతోంది. అయితే ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనే విషయాన్ని వేచి చూడాల్సి ఉంది. అయితే నిపుణులు మాత్రం దీర్ఘకాలంలో ప్రయోజనాలను గమనించాలని, తాత్కాలిక నష్టాలను, మార్కెట్ ఒడిదొడుకులను ఇన్వెస్టర్లు పరిగణలోకి తీసుకోవద్దని అంటున్నారు. తొందరపడి తక్కువ ధరలకు విక్రయించి నష్టపోవద్దని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు.