LIC News: రిటర్న్స్ కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే అనే సామెత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బాగా తెలిసిందే. అయితే ఈ సాహసం చేయటానికి చాలా గుండె ధైర్యం కావాల్సిందే. ఇప్పుడు దేశీయ ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ ఇదే పని చేస్తోంది.
దేశంలో అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుగా ఉన్న ఎల్ఐసీ జూన్ త్రైమాసికంలో వేల కోట్ల రూపాయలను ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. విశ్లేషకులు జాగ్రత్తగా మారినప్పటికీ.. తన దూకుడును ఏమాత్రం తగ్గించకుండా పెట్టుబడులు కొనసాగించింది. చాలా మంది కొనేందుకు డేర్ చేయని రంగాల షేర్లలో కొత్త పెట్టుబడులను పెట్టింది. ఈ క్రమంలో దేశంలోని కొన్ని అతిపెద్ద టెక్ కంపెనీల్లోకి రూ.8,000 కోట్లను పెట్టుబడులు పంప్ చేసి ఐటీ రంగంపై విశ్వాసాన్ని ప్రదర్శించింది.

ప్రైమ్ డేటాబేస్ నివేదిక ప్రకారం ఇన్ఫోసిస్లో రూ.3,636 కోట్లు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో రూ.1,973 కోట్లు, టెక్ మహీంద్రాలో రూ.1,468 కోట్లు , హెచ్సీఎల్ టెక్నాలజీస్లో రూ.979 కోట్ల విలువైన షేర్లను ఎల్ఐసీ కొనుగోలు చేసింది. వడ్డీ రేట్ల పెరుగుదలతో పాటు ఇతర ఆర్థిక అస్థిరతలు అమెరికా, యూరప్ మార్కెట్లను ముట్టడించగా భారత ఐటీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా ఆదాయాలు, లాభాలు తగ్గుతున్న రంగంపై ఇన్సూరెన్స్ దిగ్గజం బెట్ చేసింది.
ఎల్ఐసీ సాహసోపేతమైన పెట్టుబడి నిర్ణయాలపై వెల్త్మిల్స్ సెక్యూరిటీస్ నుంచి క్రాంతి బథిని వ్యాఖ్యానిస్తూ.. ఎల్ఐసీ తన దీర్ఘకాలిక పెట్టుబడి మంత్రంతో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ఆకర్షనీయమైన విలువల వద్ద పెట్టుబడి అవకాశాలను చూస్తోందని తెలిపారు. తాజా జూన్ త్రైమాసికంలో పెట్టుబడి ఆదాయం భారీగా ఉండటం కూడా దీనినే సూచిస్తోంది.
జూన్ త్రైమాసికంలో తన పోర్ట్ఫోలియోలో అత్యధిక భాగాన్ని ఏర్పాటు చేసిన ఆర్థిక సేవల సంస్థల్లో ఎల్ఐసి రూ.2.88 లక్షల కోట్ల విలువైన షేర్లను కలిగి ఉంది. రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐటీ కంపెనీల్లో రూ.14,671 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.


Click it and Unblock the Notifications