ఉక్కు సంక్షోభంపై ఆందోళన.. ఉక్రెయిన్లో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్పై రష్యా దాడి..
తూర్పు ఐరోపాలో రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ పోరాటం రోజురోజుకూ మరింత రక్తాసిక్తంగా, విధ్వంసకరంగా మారుతోంది. ఇరు దేశాలు పరస్పరం ప్రత్యర్థి భూభాగాలలోని మౌలిక సదుపాయాలు, ఇంధన కేంద్రాలు, భారీ పారిశ్రామిక సముదాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులను తీవ్రతరం చేశాయి.
ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ప్రపంచ బిలియనీర్ లక్ష్మీ మిట్టల్కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్కు తీవ్ర ఆర్థిక, ఆస్తి నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన 'క్రివి రిహ్' (Kryvyi Rih) నగరంలో ఉన్న దేశంలోనే అత్యంత భారీ ఉక్కు కర్మాగారమైన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్పై రష్యా రాత్రికి రాత్రే బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది.
ఈ క్షిపణి దాడిలో కర్మాగారానికి చెందినద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కంపెనీ, కాంట్రాక్టర్ సంస్థలకు చెందిన దాదాపు 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సహాయం అందిస్తున్నారు. ఉక్రెయిన్లోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రాలలో ಒకటైన ఈ ఉక్కు ప్లాంట్లో ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్కు ఏకంగా 93.02 శాతం వాటా ఉంది. దాడి అనంతరం ఆర్సెలార్ మిట్టల్ క్రివి రిహ్ యాజమాన్యం తమ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా ఈ విషాదకర పరిణామాన్ని ధ్రువీకరించింది. తమ ప్లాంట్పై శత్రు దేశం పథకం ప్రకారం దాడి చేసిందని.. దీంతో అత్యంత కీలకమైన ఉత్పత్తి విభాగాలు దెబ్బతిన్నాయని పేర్కొంది.

క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. రష్యా ప్రయోగించిన క్షిపణులు ప్లాంట్లోని ఎనర్జీ నెట్వర్క్, విద్యుత్ సరఫరా కేంద్రాలు, బ్లాస్ట్ ఫర్నేస్లకు చెందిన కీలక ప్రాసెసింగ్ సౌకర్యాలపై నేరుగా పడ్డాయి. విద్యుత్ లైన్లు తెగిపోవడం, ఫర్నేస్ విభాగాలు దెబ్బతినడంతో ప్లాంట్లోని ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలన్నీ పాక్షికంగా నిలిచిపోయాయి.
నిరంతర విద్యుత్ సరఫరా, సంక్లిష్టమైన మౌలిక సదుపాయాలపై ఆధారపడే ఇటువంటి భారీ ఉక్కు పరిశ్రమకు ఎనర్జీ, ఫర్నేస్ విభాగాల్లో నష్టం వాటిల్లడం అత్యంత తీవ్రమైన విషయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల బృందాలు ప్లాంట్లో నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నాయి. దెబ్బతిన్న విభాగాలకు మరమ్మతులు చేయడానికి ఎంత సమయం పడుతుంది. ఉత్పత్తిని మునుపటి లాగా పూర్తిస్థాయిలో పునఃప్రారంభించడానికి ఎంత కాలపరిమితి అవసరమవుతుందనే విషయాలపై అధ్యయనం చేస్తున్నారు.
ఈ క్షిపణి దాడి కేవలం ఒకే ప్లాంట్కు పరిమితమైనది కాదని, ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా చేపట్టిన విస్తృత వైమానిక దాడుల్లో భాగమని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. దేశ రాజధాని కీవ్తో పాటు పలు కీలక నగరాలపై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రష్యా ఆర్మీ సైనిక లక్ష్యాల కంటే పౌర, పారిశ్రామిక మౌలిక సదుపాయాలనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. గత వారం రోజుల్లోనే రష్యా బలగాలు ఉక్రెయిన్ నగరాలపై 1,550కి పైగా దాడి డ్రోన్లు, 1,560 గైడెడ్ ఏరియల్ బాంబులు మరియు 62 క్షిపణులను ప్రయోగించి తీవ్ర మానవకారక నష్టాన్ని మిగిల్చాయని ఆయన వివరించారు.
అయితే, ఈ దాడులను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సమర్థించుకుంది. క్రివి రిహ్లోని లోహ కర్మాగారంతో పాటు కీవ్లోని సైనిక-పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలను తాము విజయవంతంగా ధ్వంసం చేశామని మాస్కో ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాపై మునుపెన్నడూ లేని స్థాయిలో డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లిన 822 ఉక్రేనియన్ డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని మాస్కో ప్రకటించింది. మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ జరిపిన ఈ రికార్డు స్థాయి డ్రోన్ దాడిలో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తమ భూభాగంపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2022లో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్లోని పారిశ్రామిక రంగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులోనూ యుద్ధ రంగానికి సమీపంలో ఉన్న క్రివి రిహ్ ప్రాంతంలో ఉన్న ఈ ఉక్కు కర్మాగారం నిరంతరం దాడుల ముప్పులో జీవిస్తోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు, ఉక్కు రంగానికి ఈ తాజా దాడి కోలుకోలేని దెబ్బగా మారింది. విద్యుత్ సంక్షోభం, రవాణా అడ్డంకులతో కొట్టుమిట్టాడుతున్న ప్లాంట్కు తాజా నష్టం వల్ల ఉత్పత్తి మరింత పడిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ ఉక్కు సరఫరా వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications
