హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-వరంగల్ నగరాల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్లను శాంక్షన్ చేయాలని కేంద్రమంత్రి పీయూష్గోయల్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. గురువారం కేటీఆర్ కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాగే, తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటుకు కూడా సహకరించాలని కోరారు.
కాగా, అంతకుముందు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏరోస్పేస్ షో వింగ్స్ ఇండియా 2020 కార్యక్రమ సన్నాహక సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, అధికారులు, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు తెలంగాణలో ప్రాధాన్యరంగాల హోదా ఇచ్చామని, ఈ రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయన్నారు. దేశంలోని ప్రగతిశీల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని, ప్రభుత్వ పాలసీలు, పని తీరుతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. గత అయిదేళ్లలో తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం ఈకో సిస్టం బాగా అభివృద్ధి చెందిందన్నారు.
ఏరో స్పేస్ మాన్యుఫాక్చరింగ్లో ప్రపంచస్థాయి కంపెనీలైన బోయింగ్, జీఈ, సాఫ్రాస్, రాఫెల్, లాక్ హీడ్ మార్టిన్ తదితర కంపెనీలు తెలంగాణకు వచ్చాయన్నారు. స్థానికంగా సుమారు 1000 ఏరో స్పేస్, డిఫెన్స్ కంపెనీలు MSME రంగంలో ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో నాలుగు ఏరో స్పేస్ పార్కులు ఉన్నాయని, అనేక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, హార్డ్ వేర్ పార్కులు, టెక్నాలజీ సెజ్లు ఉన్నాయన్నారు.
ఏరో స్పేస్ శిక్షణలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో టీ హబ్, వీ హబ్ ఉన్నాయని, త్వరలో ప్రారంభం కానున్న టీ వర్క్స్ ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో వినూత్న ఆలోచనలు ముందుకు వస్తాయని చెప్పారు. తాము డ్రోన్ పాలసీని తీసుకు వస్తామని కేంద్రం చెబుతోందని, అయితే దేశంలోనే డ్రోన్ పాలసీలో తెలంగాణ ముందుందని చెప్పారు.


Click it and Unblock the Notifications