Q2లో అదరగొట్టిన కొటక్ మహీంద్రా, నికర లాభం 26% జంప్
ప్రయివేటురంగ మూడో దిగ్గజ బ్యాంకు కొటక్ మహీంద్రా 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన లాభాలు 26.27 శాతం పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ నెట్ ప్రాఫిట్ రూ.2,184.48 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,724.48 కోట్లుగా ఉంది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేసింది.
నికర వడ్డీ ఆదాయం 16.8 శాతం పెరిగి రూ.3,913 కోట్లను దాటింది. గత ఏఢాది రూ.3,350 కోట్లుగా ఉంది. లోన్ బుక్ 4 శాతం క్షీణించి రూ.2.04 లక్షల కోట్లను తాకింది. డిపాజిట్లు 12 శాతం పెరిగి రూ.2.61 లక్షల కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్ ముగిసే సమయానికి గ్రాస్ ఎన్పీఏలు 2.55 శాతంగా ఉంది. నెట్ ఎన్పీఏలు 0.64 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జీన్లు 4.61 శాతం నుండి 4.52 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 9.6 శాతం క్షీణించి రూ.369 కోట్లుగా ఉంది.
సగటు సేవింగ్స్ డిపాజిట్స్ 32 శాతం పెరిగి రూ.1,06,442గా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో రూ.80,425 కోట్లుగా నమోదయింది. సగటు కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 10 శాతం పెరిగి రూ.33,216 (గత ఏడాది ఇదే కాలంలో) నుండి రూ.36,610 కోట్లకు పెరిగింది. కస్టమర్ అసెట్స్ గత ఏడాది ఇదే కాలంలో రూ.2,23,305 కోట్లు కాగా, ఈసారి రూ.2,18,790 కోట్లుగా ఉంది.