May 1st Changes: ఏప్రిల్ నెల ముగియటంతో ఇప్పుడు అందరి చూపు మార్చి మాసంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనే దానిపైనే ఉంది. ఈ క్రమంలో సామాన్యుల జోబులపై భారాన్ని మోపే అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మే మెుదటి తారీఖు నుంచి జీఎస్టీ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. వ్యాపారులు వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇకపై కొత్త నిబంధన ప్రకారం రూ.100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు లావాదేవీకి సంబంధించిన రసీదులను 7 రోజుల్లోగా ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో అప్లోడ్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది.

దీనికి తోడు మే 1 నుంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెట్టుబడిదారుల కేవైసీతో కూడిన ఈ-వాలెట్ల ద్వారా మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సెబీ ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. పెట్టుబడిదారుల భద్రత నిమిత్తం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అన్నింటి కన్నా ఎక్కువ మంది ప్రజలు ఎదురుచూసే అంశం గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనే ప్రకటన గురించే. ప్రతి నెల మెుదటి తేదీన చమురు కంపెనీలు ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ రేట్లను ప్రకటిస్తాయి. ఏప్రిల్ నెలలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.91.50 మేర తగ్గించింది. అయితే చాలా కాలంగా డొమెస్టిక్ వినియోగదారులు ధరల తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక చివరిగా ఒక బ్యాంకింగ్ న్యూస్ గురించి సామాన్యులు తెలుసుకోవాల్సి ఉంది. మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అయితే ఈ వార్త మీకోసమే. కస్టమర్లు మే 1 నుంచి వారి ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసి లావాదేవీ విఫలమైతే వారిపై రుసుము వసూలు చేయాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇందుకోసం రూ.10తో పాటు జీఎస్టీని వసూలు చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.



Click it and Unblock the Notifications