Changing Rules: నేటితో జూన్ మాసం ముగుస్తోంది. అయితే జూలై నెల మెుదటి తారీఖు నుంచి అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవి మీ జోబుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తప్పక తెలుసుకోండి..
ముందుగా ప్రతినెల మాదిరిగా దేశంలోని చమురు కంపెనీలు నెల ప్రారంభ రోజున ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రకటించనున్నాయి. గత నెలలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరను కంపెనీలు రూ.83.50 మేర తగ్గించగా.. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగించాయి. అలాగే CNG-PNG ధరల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.

జూలై 2023లో బ్యాంక్ సెలవుల జాబితాను ఇప్పటికే RBI విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులు మెుత్తంగా 15 రోజుల పాటు సెలవులో ఉండనున్నాయి. స్థానిక పండుగలకు అనుగుణంగా సెలవుల్లో కొన్ని మార్పులు ఉంటాయి. అందువల్ల బ్యాంకుకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే.. వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవటం మంచిది.
వచ్చే నెలలో ముఖ్యంగా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాల్సిన పని ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్. ఎందుకంటే ఇందుకోసం జూలై 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పటి వరకు ఐటీఆర్ దాఖలు చేయకపోతే దానిని గడువులోగా పూర్తి చేయండి. విఫలమైన పక్షంగా పెనాల్టీతో పన్నును చెల్లించాల్సి రావచ్చు.
జూలై 1 నుంచి దేశంలో నాణ్యతలేని పాదరక్షల తయారీ, విక్రయాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(QCO) అమలు చేయాలని పాదరక్షల యూనిట్లను ప్రభుత్వం ఆదేశించింది. దీని కింద పాదరక్షల కంపెనీలకు QCO తప్పనిసరి చేయబడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా తాజా మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇకపై కంపెనీలు ఈ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చెప్పులు, బూట్లు వంటివి తయారు చేయాల్సి ఉంటింది. ప్రస్తుతం 27 పాదరక్షల ఉత్పత్తులను క్యూసీఓ పరిధిలో ప్రవేశపెట్టారు.


Click it and Unblock the Notifications