Notes Ban: రూ.2000 నోట్ల నిషేధం.. స్టాక్ మార్కెట్లపై ఉండే ప్రభావం ఇదే..
Notes Ban: దేశంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా సర్క్యూలర్ ప్రకారం రూ.2000 నోట్లు కలిగి ఉన్న వ్యక్తులు సెప్టెంబరు 30 లోగా వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంక్ డేటా ప్రకారం మార్చి 31,2018 నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇది మొత్తం విడుదలైన నోట్లలో 37.3 శాతం. అయితే మార్చి 31, 2023 నాటికి రూ.2000 నోట్ల వాటా 10.8 శాతానికి తగ్గింది. పైగా ఇవి చలామణిలో నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి.
గతంలో జరిగిన డీమానిటైజేషన్ కంటే ఇప్పుడు నోట్ల మార్పిడి ప్రక్రియ చాలా సులభతరం అయింది. ఈ క్రమంలో నోట్ల రద్దు నిర్ణయం దేశీయ స్టాక్ మార్కెట్లపై పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రిజర్వు బ్యాంక్ తీసుకున్న చర్య వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వారు చెబుతున్నారు. పైగా స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఎక్కువగా ఆన్ లైన్ విధానంలో నడుస్తాయి కాబట్టి ఇన్వెస్టర్లు ఇబ్బందులను ఎదుర్కోరని వారు అంటున్నారు.
ఇదే క్రమంలో సామాన్య ప్రజలు సైతం నగదు లావాదేవీలు, చెల్లింపులకు ఎక్కువగా డిజిటల్ చెల్లింపు మార్గాలను వినియోగించటం వల్ల రూ.2000 నోట్ల రద్దు ప్రభావం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రజలు సాధారణంగా ఆన్లైన్ చెల్లింపు సౌకర్యాలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. దీనివల్ల 2016లో డీమోనిటైజేషన్ లాంటి ప్రభావం ఉండకూడదని స్టాక్ మార్కెట్ ఇండిపెండెంట్ మార్కెట్ విశ్లేషకుడు అంబరీష్ బలిగా అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై తాజా నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదని వెల్త్మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బథిని పేర్కొన్నారు.