Investment: ఒక్కపెట్టుబడితో పోర్ట్ఫోలియోలో 50 కంపెనీలు.. ఎలాగంటే..?
Investment: ఈరోజుల్లో చాలా మంది పాసివ్ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్లను ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే వారికి మార్కెట్లపై పూర్తి అవగాహన ఉండకపోవటం. దీంతో ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకోవటం కష్టతరంగా మారుతుంది.
ఇలాంటి ఇన్వెస్టర్లు తమ నష్టాలను తగ్గించుకోవటానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మెుత్తం డబ్బును ఒకే దగ్గర పెట్టుబడిగా ఉంచకపోవటం. అలాంటి వారికోసం మార్కెట్లోని టాప్-50 కంపెనీలతో కూడిన నిఫ్టీ సూచీలోని కంపెనీలను ఎంచుకోవటం ఉత్తమం. పైగా ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది.
ఇందుకోసం ఇన్వెస్టర్లు నిఫ్టీ బీస్ లో పెట్టుబడిని పెట్టవచ్చు. నిఫ్టీ బెంచ్మార్క్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ స్కీమ్. ఇది నిఫ్టీ-50 ఇండెక్స్ పనితీరును ట్రాక్ చేసే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ETF). దీర్ఘకాలంలో గమనించినట్లయితే నిఫ్టీ సూచీ క్రమంగా పెట్టుబడిదారులకు రిటర్న్స్ అందిస్తూనే ఉంది. పైగా ఇందులో ఎంపిక చేసిన ఉత్తమపనితీరు కనబరిచే లార్జ్ క్యాప్ కంపెనీలు ఉంటాయి కాబట్టి మార్కెట్ ఒడిదొడుకుల్లోనూ ఇన్వెస్టర్ల సంపదకు రక్షణ ఉంటుంది.
ఎవరైనా ఇన్వెస్టర్ నిఫ్టీ బీస్ యూనిట్లను కొనుగోలు చేసినప్పుడు.. అతను నిఫ్టీ-50 ఇండెక్స్లోని 50 కంపెనీల్లో వాటాలను కలిగి ఉంటారు. ఇలా చేయటం వల్ల వారి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ జరిగి పెట్టుబడులకు అధిక రక్షణ కలుగుతుంది. ఫండ్ మేనేజర్లు చురుకుగా నిర్వహించే నిధులతో పోలిస్తే నిఫ్టీ బీస్ చాలా తక్కువ వ్యయ నిష్పత్తిని కలిగి ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మొత్తం ఆదాయంలో కొద్ది మొత్తాన్ని ఖర్చుల రూపంలో కోల్పోతారు. పైగా వీటికి లిక్విడిటీ ఎక్కువ కాబట్టి కావాలనుకున్నప్పుడు విక్రయించుకోవచ్చు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం పెట్టుబడులపై అవగాహన కలిగించటం కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి కాబట్టి ముందుగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.