Stock Market: పేదవారైన ఇన్వెస్టర్లు.. వచ్చే వారం పరిస్థితి ఏమిటి..? లక్షల కోట్లు ఆవిరి..
Stock Market: ప్రపంచవ్యాప్తంగా అనేక సెంట్రల్ బ్యాంకులు తమ బెంచ్మార్క్ వడ్డీ రేట్లను గతవారం పెంచాయి. ఇందులో ప్రధానంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు చేసిన ప్రకటన చాలా కీలకమైనది. వడ్డీ రేట్ల పెంపు విషయంలో వెనుకడుగు ఉండబోధని తేల్చి చెప్పటంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీనివల్ల గురు, శుక్రవారాల్లో దేశయ మదుపరుల సంపద రూ.5.78 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
రెండు రోజుల్లో బీఎస్ఈ సూచీ 1350 పాయింట్ల వరకు నష్టపోయింది. దీంతో ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత రెండు రోజుల్లో రూ.5,78,648.39 కోట్లు తగ్గింది. గతవారం ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల మేర తన వడ్డీ రేటు పెంపును ప్రకటించింది. అయితే దీనికి ముందు వరుసగా నాలుగు నెలల పాటు ఫెడ్ 75 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తున్నప్పటికీ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

ఇదే క్రమంలో యూరప్, ఇంగ్లాండ్ లలోని సెంట్రల్ బ్యాంకులు సైతం ద్రవ్యోల్బణ కట్టడి చర్యల్లో భాగంగా బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచేశాయి. దీంతో అధిక వడ్డీని అందిస్తూ బాండ్లు ఆకర్షనీయంగా మారాయి. అందుకే చాలా మంది మదుపరులు తమ డబ్బును ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్ల నుంచి బాండ్లలోకి మారుస్తున్నారు. మరికొందరు మాత్రం సేఫ్ హెవెన్ బంగారంలో తమ పెట్టుబడులను పెంచుకుంటున్నారు.
శుక్రవారం ట్రేడింగ్లో బిఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.44 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.96 శాతం పడిపోయాయి. దీనికి తోడు.. రియల్ ఎస్టేట్ సూచీ 1.57 శాతం, వినియోగదారుల రంగ సూచీ 1.36 శాతం, పారిశ్రామిక సూచీ 1.32 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1. 26 శాతం, టెక్ ఇండెక్స్ 1.25 శాతం, ఐటీ ఇండెక్స్ 1.24 శాతం, ఆటో ఇండెక్స్ 1.13 శాతం పడిపోయాయి.

అయితే ఈ ప్రభావం మార్కెట్లపై వచ్చే వారం కొంత వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత ఈక్విటీ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు మాత్రం ఒడిదొడుకుల మధ్య ఫ్లాట్ గా కొనసాగవచ్చని వారు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications