5G Plan Rates: 5జీ ప్లాన్స్ రేట్లు ఎంతుంటాయో తెలుసా..? 4G సిమ్ తో 5G సేవలు పొందొచ్చా..? పూర్తి వివరాలు
5G Plan Rates: దేశంలో ఎట్టకేలకు కొత్తతరం వేగవంతమైన టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ క్రమంలో దానిపై అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. వీటి ధర ఎలా ఉంటుంది. ఉన్న 4జీ సరిపోతుంది కథ అని చాలా మంది భావిస్తున్నారు. ఈ విషయంలో అనేక అనుమానాలకు జవాబులు ఇప్పుడు చూద్దాం.
5జీ సేవలు మెుదటి విడత..
తొలి విడతలో 5జీ సేవలు దేశంలోని కొన్ని మెట్రో నగరాలకు మాత్రమే అందాయి. రానున్న కాలంలో దేశ వ్యాప్తంగా వీటిని విస్తరించే పనిలో కంపెనీలు కృషి చేస్తున్నాయి. తాజా సేవలు అందుబాటులోకి రావటం వల్ల విద్య, వైద్యం, వ్యవసాయం, బ్యాంకింగ్ సేవలు మెరుగుపడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైనా, జపాన్, అమెరికా, యూకే, యూరప్, కొరియా దేశాలు 5జీ సేవలను తమ పౌరులకు అందిస్తున్నాయి.
4జీ సిమ్ తో 5జీ సేవలు పొందవచ్చా..?
ఇప్పుడు చాలా మందిలో ఈ అనుమానం ఉంది. దీనికి ఎయిర్ టెల్ కంపెనీ బదులిస్తూ.. ప్రస్తుతం కంపెనీ అందించింది 4జీ సిమ్ లతో 5జీ సేవలను పొందవచ్చని వెల్లడించింది. అయితే రిలయన్స్ జియో, వొడఫోన్ ఐడియా కంపెనీలు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే 5జీ ఫోన్ లో 5జీ సిమ్ వేసి వినియోగించటం వల్ల దాని పూర్తి ప్రయోజనాలను పొందగలరని నిపుణులు సూచిస్తున్నారు.
5జీ ప్లాన్స్ ఎలా ఉంటాయి..?
ముందుగా భారత కస్టమర్లు ఆలోచిస్తున్నది 5జీ ప్లాన్స్ రేట్లు ఎలా ఉంటాయి అనే విషయం గురించే. వినియోగదారులు 5జీకి అలవాటు పడేంత వరకు 4జీ ప్లాన్స్ రేట్లకే 5జీని అందించాలని రిలయన్స్ జియో భావిస్తున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది. 5జీ విలువను గుర్తించేంత వరకు ధరలను పెంచకూడదని జియో నిర్ణయించుకుంది. దేశంలో అందరికీ 4జీ అలవాటు చేసిన విధంగా తొలుత 5జీని అందుబాటు రేట్లలో ప్రవేశ పెట్టాలని జియో ప్లాన్ చేసింది.
జియో 5జీ ఫోన్స్..
దేశంలో 5జీ లాంచ్ తర్వాత అందుబాటు ధరల్లో 5జీ మెుబైళ్లను అందించాలని రిలయన్స్ నిర్ణయించుకుంది. ఇందుకోసం జియో బడ్జెట్ ధరలో ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇదే సమయంలో రూ.15 వేలకే ల్యాప్ టాప్ అందించనున్నట్లు పెద్ద బాంబు లాంటి వార్తను ప్రకటించింది. దీనికి జియో బుక్ అని పేరు పెట్టింది. ఇప్పటికే అనేక కంపెనీలు 5జీ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. Lava Blaze 5G కేవలం రూ.10,000 కు అందుబాటులో ఉంది.