Metro: రిలయన్స్ రిటైల్ చేతికి మెట్రో బ్రాండ్ .. డీల్ బలవంతంగా జరిగిందా..?
Metro: జపాన్ కు చెందిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ భారత వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు పూర్తి చేసింది. రిలయన్స్ రిటైల్ వెంటర్స్ లిమిటెడ్ రూ.2850 కోట్లకు ఈ కొనుగోలు డీల్ ను పూర్తి చేసింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని ఇషా అంబానీ చేతుల్లోకి రాగానే ఈ డీల్ జరిగింది.

మెట్రో వ్యాపారం..
ప్రస్తుతం మెట్రో రిటైల్ ఇండియాకు దేశవ్యాప్తంగా 21 నగరాల్లో స్టోర్లను కలిగి ఉంది. ఈ క్రమంలో కంపెనీకి దాదాపుగా 31 ఔట్ లెట్లు ఉన్నాయి. 2003లో వ్యాపారాన్ని భారత్ లోకి తీసుకొచ్చిన జర్మన్ కంపెనీకి మెుత్తంగా 3500 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఈ క్రమంలో కంపెనీ 30 లక్షలకు పైగా కస్టమర్ల నెట్వర్క్ కలిగి ఉంది. ఇందులో 10 లక్షల మంది బి2బి యాప్ ద్వారా షాపింగ్ చేసే మెట్రో రెగ్యులర్ కస్టమర్లు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ విక్రయాలు రూ.7,700 కోట్లుగా ఉంది.

కంపెనీ విలువ..
మెట్రో బ్రాండ్ మెుత్తం మార్కెట్ విలువ రూ.22,432 కోట్లుగా ఉంది. అయితే ఇంత విలువైన కంపెనీని కేవలం 12 శాతం ధరకే రిలయన్స్ కంపెనీకి అమ్మటంపై చర్చ జరుగుతోంది. ఈ కంపెనీని ఎందుకు బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందనే ప్రశ్న జనాల్లో తలెత్తుతోంది. జర్మన్ కంపెనీ మెట్రో ఏజీ భారత్లో తన వ్యాపారాన్ని ముగించటానికి అసలు కారణాలు ఏమిటనే విషయం కీలకంగా మారింది.

దేశాన్ని వీడుతోంది..
దేశంలోని నియంత్రణ వాతావరణం, స్వదేశీ వర్సెస్ విదేశీపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జర్మన్ కంపెనీ యాజమాన్యం ఆందోళన చెందుతోంది. దీనికి తోడు విదేశీ కంపెనీలు ఎఫ్డిఐ నిబంధనలను చాలాసార్లు ఉల్లంఘించాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇబ్బందులు ముదురుతున్న తరుణంలో కంపెనీ తన భారత వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సీఈవో ఏమన్నారంటే..
రిలయన్స్ రిటైల్ కు తమ వ్యాపారాన్ని విక్రయించటంపై మెట్రో సీఈవో డాక్టర్ స్టెఫెన్ గ్రెబెల్ స్పందించారు. తమ బ్రాండ్ను రిలయన్స్ విజయవంతంగా నడిపిస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. మెట్రో ఇండియా పగ్గాలను రిలయన్స్కు అప్పగించడం ద్వారా.. కస్టమర్లు, ఉద్యోగుల పట్ల పూర్తి శ్రద్ధ తీసుకుంటుందని తాను ఖచ్చితంగా నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు.

ఇషా అంబానీ..
మెట్రో ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేయడం వల్ల కంపెనీ రిటైల్ వ్యాపార విస్తరణ వేగవంతం అవుతుందని ఇషా అభిప్రాయపడ్డారు. చిన్న వ్యాపారుల నుంచి చిన్న పరిశ్రమల వరకు కంపెనీ చేరువ కావడానికి ఇది దోహదపడుతుందని ఆమె అన్నారు. బి2బి మార్కెట్లో మెట్రో ఇండియా పెద్దపీట వేసిందని, కంపెనీకి ఇప్పటికే అందుకు తగిన నెట్వర్క్లు ఉన్నాయన్నారు. ఈ కలయిక రిటైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఇషా అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications