Cello World IPO: అక్టోబర్ 30న సెల్లో వరల్డ్ కంపెనీ తన ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ చేసింది. ఇది కన్జూమర్ ఉత్పత్తుల తయారీ వ్యాపారంలో కొనసాగుతోంది. నవంబర్ 1, 2023న బిడ్డింగ్ ముగియనుంది.
సెల్లో వరల్డ్ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.617 నుంచి రూ.648గా నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి రూ.1,900 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ప్రమోటర్లుగా ఉన్న రాథోడ్ కుటుంబం దీనిని పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో షేర్లను విక్రయిస్తోంది. ఈ కారణంగా ఐపీవో నుంచి వచ్చిన పూర్తి డబ్బు ప్రమోటర్లకు వెళ్లనుంది. కంపెనీ తన ఐపీవోలో రూ.10 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగుల కోసం రిజర్వు చేసింది. అలాగే గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 15 శాతం అధిక రేటు పలుకుతున్నాయి.

ఇప్పటికే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.567 కోట్లను సమీకరించింది. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 23 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. అంటే ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొనేందుకు కనీసం రూ.14,904 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇష్యూ పరిమాణంలో 50 శాతాన్ని అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు, 15 శాతం అధిక నెట్వర్త్ వ్యక్తులకు కేటాయించింది. మిగిలిన 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ రిజర్వ్ చేయబడింది.
2018లో విలీనం చేయబడిన సెల్లో వరల్డ్ వినియోగదారుల గృహోపకరణాలు, స్టేషనరీ, మౌల్డ్ ఫర్నిచర్ అనుబంధ ఉత్పత్తులు, వినియోగదారు గ్లాస్వేర్ వంటి వస్తువులను తయారీ, విక్రయ వ్యాపారంలో ప్రముఖ సంస్థగా కొనసాగుతోంది. మార్చి FY23తో ముగిసిన సంవత్సరంలో నికర లాభం సంవత్సరానికి 30.5 శాతం పెరిగి రూ.266.1 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో ఆదాయం 32.2 శాతం పెరిగి రూ.1,796.7 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications