October 01st: ఇంకా 5 రోజులే.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ మారిపోతున్నాయి.. పెన్షన్ బంద్..
October 01st: మరో 5 రోజుల్లో అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. సామాన్యుల జేబుపై ప్రభావం చూపే 5 ప్రధాన మార్పులు జరగబోతున్నాయి. ఈ క్రమంలో వాటి గురించి ముందుగానే తెలుసుకుని ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యం. వీటిపై ఖచ్చితంగా శ్రద్ధ వహించటం చాలా కీలకం. వస్తున్న కీలక మార్పులు ఎలాంటి మార్పు కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిలిచిపోనున్న విద్యుత్ సబ్సిడీ..
రాజధాని ఢిల్లీలో ఉచిత విద్యుత్ సౌకర్యం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 31 తర్వాత కరెంటు బిల్లుపై ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నిలిచిపోనున్నట్లు సమాచారం. ఇకపై సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఈ కొత్త నిబంధనను ప్రకటించారు.
డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో..
అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన రూల్స్ మారుతున్నాయి. కార్డ్ టోకెనైజేషన్ విధానం తప్పనిసరి కాబోతోంది. టోకనైజేషన్ సిస్టమ్లో మార్పు తర్వాత, కార్డు హోల్డర్లు చెల్లింపులు చేయడంలో కొత్త అనుభూతిని పొందుతారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆన్లైన్ మోసాల కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాటి నివారణలో భాగంగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నారు. దీంతో గతంలో కంటే డెబిట్, క్రెడిట్ కార్డులతో లావాదేవీలు చేయడం మరింత సురక్షితం.
మ్యూచువల్ ఫండ్స్ నిబంధనల మార్పు..
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత నామినేషన్ వివరాలను అందించడం తప్పనిసరి. అలా చేయని పెట్టుబడిదారులు డిక్లరేషన్ నింపాలి. నామినేషన్ సదుపాయాన్ని డిక్లరేషన్లో ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నియమాన్ని ఆగస్టు 1, 2022 నుంచి అమలు చేయాల్సి ఉంది. గడువు పొడిగించటంతో అది వచ్చే నెలకు మారింది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ ఇకపై ఈ నిబంధనను పాటించాలి.
LPG ధర మార్పు..
పెట్రోలియం కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన LPG ధరను సవరిస్తాయి. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి వంట గ్యాస్ ధరలు కొంత మేర పెరగవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నెలలుగా ధరలు తగ్గటం లేదని సామాన్య గృహ వినియోగదారులు ఆందోళన చెందుతుండగా.. మళ్లీ రేట్ల పెంపు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది వారి జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.
సరికొత్త యాక్షన్ ప్లాన్..
అక్టోబర్ 1 నుంచి ఢిల్లీ NCR ప్రాంతంలో వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలులోకి వస్తోంది. చలికాలంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళనకలిగిస్తుంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద, కాలుష్యాన్ని పెంచడంలో సహాయపడే అన్ని చర్యలను నిషేధించారు. ఇలాంటి పరిస్థితుల్లో జనరేటర్ల నుంచి వాహనాల వరకు వచ్చే పొగ అందరిపైనా ప్రభావం చూపుతుంది. చలికాలం వచ్చిందంటే ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్య సమస్య పెరుగుతోంది.
టాక్స్ చెల్లించేవారికి పెన్షన్ బంద్..
ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన (APY) సామాజిక భద్రతా పథకంలో భారీ మార్పులు తీసుకురావటం జరిగింది. ఈ స్కీమ్ కింద ఉన్న వ్యక్తులు ఎవరైనా అక్టోబరు 1 నాటికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే వారు పెన్షన్ స్కీమ్ పొందటానికి అనర్హులని కేంద్రం ప్రకటించింది. సామాన్యులకు మెరుగైన పెన్షన్ అందించటమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.