వహ్: ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లను గిఫ్ట్గా ఇచ్చిన చెన్నై కంపెనీ
చెన్నై: చెన్నై ప్రధాన కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న కిస్ఫ్లో ఇంటర్నేషనల్ కార్పొరేషన్- తన ఉద్యోగులకు అరుదైన బహుమతిని అందజేసింది. ఎవరూ ఊహించలేని గిఫ్ట్ ఇది. సుదీర్ఘకాలంగా సంస్థలో పని చేస్తోన్న సీనియర్ ఎగ్యిక్యూటివ్స్కు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చింది. ఒక్కో కారు ధర కోటి రూపాయల పైమాటే. ఒక దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీ తన సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కు ఈ స్థాయిలో కార్లను అందించడం కార్పొరేట్ సెక్టార్లో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
కిస్ఫ్లో- క్లౌడ్ బేస్డ్ బీపీఎం ప్లాట్ఫామ్ కంపెనీ. సురేష్ సంబందం 2012లో సార్టప్గా దీన్ని నెలకొల్పారు. సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీగా ఎదిగింది. బీపీఎం ప్లాట్ఫామ్పై అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీని నెలకొల్పి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వ్యవస్థాపక ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ సంబందం.. అయిదుమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కు కోటి రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లను బహుమతిగా అందజేశారు.
ఈ చిరస్మరణీయమైన బహుమతిని అందుకున్న వారిలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ దినేష్ వరదరాజన్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కౌశిక్రామ్ కృష్ణసాయి, ఇంజినీరింగ్ వింగ్ డైరెక్టర్లు వివేక్ మధురై, ఆది రామనాథన్, సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న రాజేంద్రన్ ఉన్నారు. తమకు బీఎండబ్ల్యూ కార్లు అందబోతోన్నాయనే విషయాన్ని కంపెనీ యాజమాన్యం చివరి నిమిషం వరకు వెల్లడించలేదు. మధ్యాహ్నం భోజన సమయంలో సురేష్ సంబందం అందరి సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ అయిదుమందీ సుదీర్ఘకాలంగా సంస్థతో అసోసియేట్ అయి ఉన్నారని, పురోగమనంలో కీలక పాత్ర పోషించారని సురేష్ సంబందం చెప్పారు. ఈ అయిదుమంది లేకపోతే సంస్థ లేదని పేర్కొన్నారు. సంస్థను నెలకొల్పి 10 సంవత్సరాలయిన సందర్భంగా వారికి ఓ అరుదైన బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, దీనికి బీఎండబ్ల్యూ కార్లను మించిన బహుమతి మరొకటి ఉండబోదని చెప్పారు. అయినా వారు పడిన కష్టం ముందు ఈ బహుమతి కూడా చిన్నదేనని సురేష్ సంబందం అన్నారు. సంస్థకు 90 శాతానికి పైగా ఆదాయం విదేశాల నుంచే అందుతోందని, కంపెనీ కార్యకలాపాలను ఆ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ అయిదుమందీ శ్రమించారని పేర్కొన్నారు.