Air India: ఖలిస్థానీ వేర్పాటువాద ధోరణి రోజురోజుకూ విపరీతంగా మారుతోంది. ఇప్పటికే కెనడా కేంద్రంగా భారీ స్థాయిలో ర్యాలీలు, నినాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం నవంబర్ 19న ఎయిర్ ఇండియా ద్వారా ప్రయాణించే వ్యక్తుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు జారీ చేయటం కలకలం సృష్టిస్తోంది. ఆ తేదీన సిక్కులు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని సన్నూన్ సూచించారు.

రానున్న నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసివేయబడుతుందని దాని పేరు మార్చబడుతుందని పన్నూన్ వీడియోలో చెప్పడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్లో ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఇదేనని ఖలిస్తానీ ఉగ్రవాది హైలైట్ చేశాడు. దీనికి ముందు అక్టోబర్ 10న నిషేధిత US ఆధారిత సిక్కుల ఫర్ జస్టిస్(SFJ) సంస్థకు చీఫ్గా ఉన్న పన్నూన్ ప్రధాని మోదీని బెదిరించాడు. పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు అక్రమ నిర్భందంలో ఉన్న వారందరూ తిరగబడతారని.. ఇజ్రాయెల్ పాలస్తీనా పరిస్థితులు ఏర్పడతాయని అన్నాడు.
వాస్తవానికి అమృత్సర్లో జన్మించిన పన్నూన్ 2019 నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) స్కానర్లో ఉన్నాడు. దర్యాప్తు ఏజెన్సీ అతనిపై మొదటి కేసును నమోదు చేసింది. అతని బెదిరింపులు వ్యూహాల ద్వారా పంజాబ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భయాందోలను వ్యాప్తి చేయడంలో, ఉగ్రవాద చర్యలు, కార్యకలాపాలను సమర్ధించడంలో, వాటిని ప్రారంభించడంలో ప్రాథమిక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక NIA కోర్టు పన్నన్పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.


Click it and Unblock the Notifications