కార్వీ కుంభకోణం: సొంత అవసరాలకు లక్ష మంది క్లయింట్లు బలి!
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.... మన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించే కార్వీ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుమారు రూ 2,000 కోట్ల కుంభకోణంగా భావిస్తున్న ఈ కేసులో తన సొంత అవసరాల కోసం సుమారు లక్షమంది కస్టమర్లను కార్వీ బలి చేసింది. వారంతా ఎంతో నమ్మకంతో తన వద్ద సెక్యూరిటీగా పెట్టిన స్టాక్స్ ను వివిధ బ్యాంకుల వద్ద తనఖా పెట్టి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించింది. ఆ నిధులను సొంతానికి వాడేసుకొంది.
ఈ విషయం పాపం ఆయా క్లయింట్ లకు తెలియదు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (యెన్ఎస్ఈ) అనుమానం నిజమైంది. కొంత కాలంగా కార్వీ వ్యవహారంపై నిఘా పెట్టిన ఈ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)కు ఫిర్యాదు చేసింది. విచారణలో నిజాలు నిగ్గు తేలటంతో వెంటనే కార్వీ కొత్త క్లయింట్లను తీసుకోవద్దని సెబీ నిషేధం విధించింది. భారీ అవకతవకలకు పాల్పడిన కార్వీ వ్యవహారంలో తదుపరి విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బలైన 95,000 మంది క్లయింట్లు ...
కొంత కాలంగా కార్వీ చేసిన నిర్వాకం ప్రస్తుతం బయటపడింది. తన వద్ద స్టాక్స్ సెక్యూరిటీగా పెట్టిన సుమారు 95,000 మంది క్లయింట్ల ను కార్వీ మోసం చేసిందని తెలుస్తోంది. వీరికి తెలియకుండానే వారి స్టాక్స్ తనఖా పెట్టి సుమారు రూ 2,300 కోట్ల నిధులను సమీకరించినట్లు ఆరోపణ. ఈ స్టాక్స్ ను మూడు ప్రైవేట్ బ్యాంకులతో పాటు ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వద్ద తనఖా పెట్టిందని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఒక్క నాన్ బ్యాంకింగ్ కార్పొరేషన్ నుంచే రూ 600 కోట్ల రుణాలను పొందినట్లు ప్రస్తుతము కొనసాగుతున్న సెబీ విచారణలో తేలిందని ఈటీ పేర్కొంది. అయితే, సెబీ విచారణ నివేదిక ఇంకా అధికారికంగా బయటకు వెల్లడించలేదు.
అప్పుడే తెలిసింది...
కార్వీ వ్యవహారం ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఒక అదనపు తనిఖీ లో బయటపడినట్లు సమాచారం. మే నెలలో సెబీ బ్రోకర్స్ ఖాతాలను వెరిఫై చేసింది. డిపాజిటరీస్ నుంచి క్లయింట్ల లావాదేవీలను పరిశీలించింది. ఈ పరిశీలన జరుపుతున్నపుడు ఒకే రోజు దాదాపు 21,000 అలెర్ట్ లు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సెబీ మరింత నిఘా పెట్టింది. ఈ సమయంలోనే స్టాక్స్ క్లయింట్ అకౌంట్ల నుంచి డిపాజిటరీలకు కాకుండా థర్డ్ పార్టీ లకు బదిలీ అవుతున్నట్లు సెబీ గుర్తించింది. ఇందుకు సంబంధించి జనవరి 1 నుంచి ఆగష్టు 19 వరకు కార్వీ స్టాక్ బ్రోకింగ్ పై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి పరిమిత విచారణ చేసినట్లు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది.
ఆర్బీఐ కి బ్యాంకుల వ్యవహారం...
కాగా ఈ కుంభకోణానికి సంబంధించి బ్యాంకుల పాత్రపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ )కి ఫిర్యాదు చేయాలని సెబీ భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే... కార్వీ తమ కస్టమర్లకు సంబంధించిన స్టాక్స్ ను తన సొంత అవసరాల కోసం తనఖా పెట్టుకొనే అధికారం లేదని సెబీ నిర్ధారించింది. అయినప్పటికీ బ్యాంకులు ఎలా కార్వికీ రుణాలు మంజూరు చేశాయా అన్నది ప్రశ్నర్థకంగా మారింది. ఇంత భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసేప్పుడు బ్యాంకులు ఏమాత్రం డ్యూ డిలీజెన్స్ నిర్వహిస్తున్నాయో తెలియటం లేదని సెబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అందుకే బ్యాంకులపై ఆర్బీఐ ని ఫిర్యాదు చేయాలనీ భావిస్తున్నారు.
రూ 400 కోట్లే...
ఇదిలా ఉండగా... ఈ కుంభకోణానికి సంబంధించి ది ఎకనామిక్ టైమ్స్ అడిగిన పలు ప్రశ్నలకు స్పందించిన కార్వీ వివరణ ఇచ్చింది. మీడియా లో వస్తున్నట్లు బ్యాంకుల వద్ద షేర్లు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి సమీకరించిన రుణాలు రూ 600 కోట్లు కాదని తెలిపింది. అవి కేవలం రూ 400 కోట్ల మేరకు ఉంటాయని కార్వీ స్పష్టం చేసింది. బ్యాంకుల వద్ద క్లయింట్ల షేర్లను తనఖా పెట్టటం సాధారణంగా అన్ని బ్రోకరేజ్ సంస్థలు చేసే పనేనని కార్వీ వివరించింది. షేర్లను తనఖా పెట్టడం నిషేధం అని సెబీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని కూడా తెలిపింది.