Bengaluru: 30 ఏళ్ల పాటు ఒకే కంపెనీకి చెత్త కాంట్రాక్ట్.. మైండ్ బ్లాంక్ అయ్యే లెక్కలు ఇవే!
ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) నగరంలో చెత్త సమస్య ఎంత దారుణంగా ఉంటుందో అక్కడ నివసించే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే పేరుతో కర్ణాటక ప్రభుత్వం ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా ₹39,437 కోట్ల విలువైన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు సిద్ధరామయ్య ప్రభుత్వం ఆమోదం తెలపడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రాష్ట్ర ఆర్థిక శాఖ (Finance Department) ఈ ప్రాజెక్ట్ నియమ నిబంధనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గకుండా రాబోయే 30 ఏళ్ల కాలానికి ఈ భారీ కాంట్రాక్టును ఒకే ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టింది.
ఈ ప్రాజెక్ట్ కింద నార్త్ , సౌత్ బెంగళూరు పరిధిలోని చెత్త నిర్వహణ బాధ్యతలను 'ఢిల్లీ MSW సొల్యూషన్స్ లిమిటెడ్' (హైదరాబాద్కు చెందిన రామ్కీ గ్రూప్ అనుబంధ సంస్థ) కి అప్పగించారు. ఈ ఒప్పందం ప్రకారం, నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే దాదాపు 5,200 టన్నుల చెత్తను సేకరించి, ప్రాసెస్ చేసే బాధ్యత ఈ సంస్థదే.

ఆర్థిక శాఖ వద్దన్నా వినని ప్రభుత్వం!
ఈ ప్రతిపాదన క్యాబినెట్ ముందుకు రాకముందే ఆర్థిక శాఖ అధికారులు గట్టిగానే అభ్యంతరాలు చెప్పారు. దానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. మొదటిది.. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం టెండర్ల తర్వాత ఊహించని విధంగా పెరిగిపోయింది. నార్త్ బెంగళూరు ప్యాకేజీ ఖర్చు ₹17,983 కోట్ల నుండి ₹21,444 కోట్లకు, అలాగే సౌత్ ప్యాకేజీ ఖర్చు ₹15,065 కోట్ల నుండి ₹17,993 కోట్లకు పెరిగింది. అంటే ప్రాజెక్ట్ మొదలవ్వక ముందే ఏకంగా ₹6,389 కోట్ల అదనపు భారం పడింది.
దీనికి తోడు, ఈ అగ్రిమెంట్ లో ప్రతి ఏటా 5 శాతం చొప్పున కాంట్రాక్ట్ విలువను పెంచే (Annual Escalation) క్లాజ్ ఉంది. 30 ఏళ్ల పాటు ఈ చక్రవడ్డీ లాంటి పెంపుదల వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఖజానాపై, మున్సిపల్ సంస్థలపై మోయలేని భారం పడుతుందని ఫైనాన్స్ ఆఫీసర్లు హెచ్చరించారు. ఒకే కంపెనీకి మొత్తం బెంగళూరు (Bengaluru) సిటీని అప్పగించడం వల్ల 'వెండార్ లాక్-ఇన్' సమస్య వస్తుందని, కాబట్టి ఈ కాంట్రాక్ట్ కాలాన్ని 30 ఏళ్ల నుండి 10 ఏళ్లకు తగ్గించాలని, వార్షిక పెంపును 2.5 శాతానికే పరిమితం చేయాలని వారు సిఫార్సు చేశారు.
సమస్య తీవ్రత వల్లే ఈ నిర్ణయమా?
అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటోంది. బెంగళూరు (Bengaluru) లో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సంక్షోభాన్ని నివారించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్తోంది. ప్రస్తుతం నగరంలో రోజుకు 5,200 టన్నుల చెత్త వస్తుంటే.. అందులో కేవలం 1,800 టన్నులను మాత్రమే సైంటిఫిక్ పద్ధతిలో ప్రాసెస్ చేస్తున్నారు. మిగతా చెత్త అంతా ల్యాండ్ఫిల్స్కు (చెత్త కుప్పలు) చేరి పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పై కూర్చుంది.
గత పదేళ్లుగా బెంగళూరును వేధిస్తున్న ఈ గార్బేజ్ మాఫియా, అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా మోడ్రన్ టెక్నాలజీతో నగర రూపురేఖలు మార్చవచ్చని మద్దతుదారులు అంటున్నారు. కానీ, పారదర్శకత లేని ఈ డీల్ వల్ల భవిష్యత్తులో పన్నులు కట్టే సామాన్య ప్రజలపైనే భారం పడుతుందని విమర్శకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా, ఈ ₹39,437 కోట్ల ప్రాజెక్ట్ బెంగళూరు (Bengaluru) చెత్త సమస్యకు నిజమైన ముగింపు పాడుతుందా లేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications