'ఏక్దమ్' బిర్యానీ దెబ్బకు, డామినోస్ ఇన్వెస్టర్లకు కలిసొచ్చింది!
ముంబై: చాలామందికి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. హోటల్కు వెళ్తే బిర్యానీ తినేవాళ్లు ఎక్కువగా ఉంటారు. బిర్యానీ ప్రియుల కోసం ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ చైన్ డామినోస్ పిజ్జా సిద్ధమైంది. 'ఏక్దమ్' బిర్యానీ పేరుతో మార్కెట్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ బిర్యాని మొదట గురుగ్రామ్లోని మూడు రెస్టారెంట్లలో లభిస్తుందని, ఆ తర్వాత ఢిల్లీలో ప్రారంభిస్తామని తెలిపింది. ఈ సేవలు యాప్, వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది
పెద్ద బ్యాంకులు సరే.. సేవింగ్స్ అకౌంట్పై ఈ బ్యాంకులు మంచి ఆఫర్
వెరైటీ బిర్యానీలు..
హైదరాబాద్ బిర్యానీ, లక్నో నవాబ్ బిర్యానీ, కోల్కతా బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీ వంటి 20 రకాల బిర్యానీలను కస్టమర్లకు అందించనున్నట్లు జుబిలాంట్ ఫుడ్ వర్స్క్స తెలిపింది. వెజ్, నాన్-వెజ్ వంటలను వేర్వేరుగా చేస్తామని తెలిపింది. వీటితో పాటు కబాబ్స్, స్వీట్స్ కూడా ఉంటాయని ప్రతినిధులు వెల్లడించారు. ఆహారాన్ని చెదరని, పర్యావరణ హితమైన ప్రత్యేక దమ్ సీలుతో అందించనున్నారు. వీటి ధరలు రూ.99 నుండి ప్రారంభమవుతున్నాయి. జుబిలాంట్ ఫుడ్ వర్క్స్కు దేశవ్యాప్తంగా 280కి పైగా పట్టణాలు, నగరాల్లో డామినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తోంది.
బిర్యానీ ఆర్డర్స్ ఎక్కువ
జుబిలాట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ డామినోస్ పిజ్జా, డంకన్ డోనట్స్ బ్రాండ్స్తో రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. మన దేశంలో బిర్యానీకీ యమ డిమాండ్ ఉంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో 2017 నుండి ఎక్కువగా వీటినే ఆర్డర్ చేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.
షేర్ 5 శాతానికి పైగా జంప్
బిర్యానీ రంగంలోకి జుబిలాంట్ ఫుడ్ వర్స్క్ ఎంటర్ కావడంతో నేడు ఆ కంపెనీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఓ సమయంలో షేర్ 10 శాతానికి పైగా ఎగబాకి రూ.2,922ను తాకింది. 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 5.56 శాతం లాభంతో రూ.2,825 వద్ద క్లోజ్ అయింది. నేడు ఒక్కరోజే షేర్ రూ.148కి పైగా లాభపడటం గమనార్హం.