5G సేవలపై ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన
ముంబై: 2021 ద్వితీయార్ధంలో జియో 5G సేవలను అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఆయన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020లో (4వ ఎడిషన్) ప్రసంగించారు. అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి అన్నారు. ఈ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అవసరమైన 5G నెట్వర్క్ను వేగంగా ప్రారంభించేందుకు విధానపరమైన నిర్ణయాలు భారత్ త్వరగా తీసుకోవాలన్నారు. దీనిని అందరికీ అందుబాటులోకి తేవాలన్నారు.
కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో ఇవి పాటించండి
స్వదేశీ నెట్ వర్క్
నేడు ప్రపంచంలోనే ఉత్తమ డిజిటల్ అనుసంధానం కలిగిన దేశాల్లో భారత్ ఉందని ముఖేష్ అన్నారు. ఈ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు 5జీని ప్రారంభించాలని, కాబట్టి దీనిని అందుబాటులో ఉంచడంతోపాటు సరసమైన ధరలో ఉండేలా చూడాలన్నారు. ఇందుకు జియో మార్గదర్శిగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 2021 రెండో అర్ధ ఏడాదిలో 5జీ నెట్ వర్క్ను ప్రారంభిస్తామన్నారు.
బడ్జెట్ ధరకే జియో 5జీ సేవలు విడుదల చేస్తామన్నారు. ఇది స్వదేశంలో అభివృద్ధి చెందిన నెట్ వర్క్, హార్డ్వేర్, టెక్నాలజీ ద్వారా రూపొందుతుందన్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీకగా జియో 5జీ ఉంటుందన్నారు. ప్రస్తుతం 2జీ వినియోగిస్తూ చాలా సేవలకు దూరంగా ఉన్నవారిని స్మార్ట్ ఫోన్లు వినియోగించి, వాటి ఫలాలు అందుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
వేగవంతమైన వృద్ధి
దేశంలో డిజిటల్ ఎకానమీ వేగంగా వృద్ధి సాధిస్తోందని, డిజిటల్ హార్డ్వేర్ విక్రయాలు పెరిగాయని ముఖేష్ అన్నారు. భారత్ చిప్ డిజైన్లో ప్రపంచస్థాయి ప్రమాణాల్ని అందుకుందన్నారు. దేశీయ పరిజ్ఞానంతో సెమీ కండక్టర్ పరిశ్రమకు కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. సాఫ్టువేర్ రంగంలో సాధించిన విజయాలను హార్డ్వేర్ రంగంలోను తీసుకు రావొచ్చునన్నారు. దేశంలో 30 కోట్ల మంది భారతీయులు 2జీ టెక్నాలజీలో ఉన్నారని, వారు డిజిటల్ ఎకానమీలో చేరడానికి, దాని ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
జియో ప్లాట్ఫాం ద్వారా..
జియో ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుతూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆశయాలకు తమ జియో ప్లాట్ఫాం మద్దతుగా ఉంటుందని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ, మౌలిక సదుపాయాల, ఆర్థిక సేవల, సరికొత్త వాణిజ్యం తదితర రంగాల్లో వినూత్న టెక్నాలజీ సేవలను జియో ప్లాట్ఫామ్స్ అందిస్తున్న వివరాలు వెల్లడించారు. పలు స్టార్టప్ భాగస్వాములతో జియో ప్లాట్ఫామ్స్ AI, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చెయిన్లో ప్రపంచస్థాయి సామర్థ్యాల్ని సృష్టించిందన్నారు. భారత్లో నిరూపించిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్ళకు పరిష్కారం అందించనుందన్నారు.