పసిఫిక్ మహాసముద్రం అడుగున భారీ బంగారు నిక్షేపాలు.. కంటికి కనపడని పసిడిని చూసి షాకవుతున్న సైంటిస్టులు..
పసిఫిక్ మహాసముద్ర ఉపరితలానికి అత్యంత లోతున.. జపాన్కు దక్షిణంగా ఉన్న ఒక క్రియాశీల అగ్నిపర్వత ప్రాంతంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని అత్యంత అరుదైన, భారీ బంగారం నిల్వలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జపాన్ టోక్యో నగరానికి సుమారు 350 కిలోమీటర్ల దక్షిణాన.. జపాన్ యొక్క ప్రత్యేక ఆర్థిక మండలం (EEZ) పరిధిలో ఉన్న 'హిగాషి-అవొగాషిమా' హైడ్రోథర్మల్ క్షేత్రంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ రహస్య బంగారం వెలుగులోకి వచ్చింది.
సముద్రగర్భంలోని అగ్నిపర్వత ప్రక్రియల వల్ల భూమి లోపలి పొరల నుండి పైకి తన్నుకొచ్చే అత్యంత వేడి ద్రవాలు.. చుట్టూ ఉండే చల్లని సముద్రపు నీటిని తాకినప్పుడు రసాయన మార్పులు జరిగి.. అక్కడ ఎత్తైన పొగగొట్టం వంటి ఆకారాలు ఏర్పడతాయి. అలాగే దట్టమైన సల్ఫైడ్ నిక్షేపాలు కూడా నిరంతరం ఏర్పడుతుంటాయి. ఈ ప్రత్యేక వాతావరణంలో రాగి, జింక్, వెండితో పాటు బంగారం సహజంగానే ఏర్పడుతుందని చాలాకాలంగా తెలిసినప్పటికీ.. ఇక్కడి పసిడి నిల్వలు మునుపటి రికార్డులన్నింటినీ మించి ఉన్నట్లు తాజా విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.

సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే ప్రముఖ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. ఇక్కడ లభించిన బంగారం సాధారణంగా కనిపించే లోహపు రేకులు లేదా సిరల రూపంలో కాకుండా.. సాధారణ కంటికి లేదా సాంప్రదాయ సూక్ష్మదర్శినికి కూడా కనిపించని రీతిలో దాగి ఉంది. పైరైట్ అనే ఒక రకమైన ఐరన్ సల్ఫైడ్ ఖనిజం లోపల ఈ Gold చిక్కుకొని ఉంది. దీని మెరిసే రూపం కారణంగా దీనిని సాధారణంగా ఫూల్స్ గోల్డ్ అని పిలుస్తుంటారు.
అత్యంత అధునాతనమైన సెకండరీ-అయాన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ (SIMS) సాంకేతికతను ఉపయోగించి ప్రయోగశాలలో ఈ రాతి నమూనాలను అత్యంత సున్నితంగా పరిశీలించినప్పుడు మాత్రమే ఈ కంటికి కనిపించని Gold బయటపడింది. ఈ బంగారంలో కొంత భాగం ఖనిజం లోపల అతి సూక్ష్మమైన నానోకణాల రూపంలో ఉండగా.. మరికొంత భాగం పరమాణు స్థాయిలోనే పైరైట్ యొక్క స్ఫటిక నిర్మాణంలో కలిసిపోయి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రగర్భ నిక్షేపాలలో ఇప్పటివరకు వెలుగుచూసిన వాటిలోకెల్లా అత్యధిక బంగారు సాంద్రత ఇక్కడే ఉందని పరిశోధక బృందం నిర్ధారించింది.
జపాన్ చుట్టూ ఉన్న ఇతర ఖనిజ సమృద్ధి ప్రాంతాలతో పోలిస్తే ఈ హిగాషి-అవొగాషిమా క్షేత్రం సాపేక్షంగా తక్కువ లోతులో ఉండటం వల్ల భవిష్యత్తులో వాణిజ్యపరమైన మైనింగ్ ప్రయత్నాలకు ఇది అత్యంత ఆశాజనకమైన ప్రదేశంగా నిలుస్తోంది. అయితే సముద్రపు అడుగున ఉన్న పైరైట్ నుండి పరమాణు రూపంలో ఉన్న ఈ కనిపంచని బంగారాన్ని వెలికితీయడం సాంకేతికంగా విపరీతమైన సవాళ్లతో కూడుకున్న వ్యవహారంగా కనిపిస్తోంది. వెలికితీత ఖర్చులను అదుపులో ఉంచుతూ.. ఈ సూక్ష్మ బంగారు కణాలను సమర్థవంతంగా వేరు చేయగల సరికొత్త పద్ధతుల కోసం ఇంజనీర్లు ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ వాణిజ్య ప్రయోజనాల అవకాశాలు కేవలం సిద్ధాంతాలకే పరిమితమై ఉన్నాయి.
మరోవైపు ఈ శాస్త్రీయ ఆవిష్కరణ అంతర్జాతీయంగా లోతైన సముద్ర మైనింగ్ పై జరుగుతున్న చర్చలను, వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ క్రియాశీలక హైడ్రోథర్మల్ వెంట్లు భూమిపై మరెక్కడా లేని విలక్షణమైన పర్యావరణ వ్యవస్థలకు నిలయంగా ఉన్నాయి. సముద్రం అడుగున ఉండే విపరీతమైన వేడి, పీడనానికి తట్టుకుని జీవించగలిగే ప్రత్యేకమైన పురుగులు, క్రస్టేషియన్లు, పగడాలు, స్పాంజ్లు, అరుదైన చేపలు, ఆక్టోపస్లు ఇక్కడ జీవిస్తున్నాయి.
పారిశ్రామిక మైనింగ్ పరికరాలు లేదా తవ్వకాల వల్ల వచ్చే అవక్షేపాల వల్ల ఈ సున్నితమైన జీవవైవిధ్యం దెబ్బతింటే.. ఆ నష్టాన్ని ఈ జీవులు ఎంతవరకు తట్టుకోగలవనే దానిపై శాస్త్రవేత్తలకు ఇంకా పూర్తి అవగాహన లేదు. హిగాషి-అవొగాషిమా పరిసరాల్లోని అనేక జీవజాతుల వివరాలు ఇప్పటికీ పూర్తిగా నమోదు కానందున.. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందే ఈ అపురూపమైన సముద్రగర్భ ఆవాసాలకు పటిష్టమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సముద్ర శాస్త్రవేత్తలు బలంగా వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications
