ఎట్టకేలకు కనిపించిన అలీబాబా అధినేత జాక్ మా
చైనా కుబేరుడు, అలీబాబా అధినేత జాక్ మా రెండు నెలలుగా బయటకు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.అతని నేతృత్వంలోని అలీబాబాకు వరుస షాక్లు తగులుతున్నాయి. జాక్ మాతో పాటు అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యాన్ని కొద్ది రోజులుగా చైనీస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. అలీబాబా గుత్తాధిపత్య నిబంధనల కింద దర్యాఫ్తుకు ఆదేశించాయి.
గత ఏడాది యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపై దర్యాఫ్తు ప్రారంభించాయి. వివిధ కారణాలు చూపించి యాంట్ గ్రూప్ అతిపెద్ద ఐపీవోకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో జాక్ మా కనిపించకపోవడం చర్చకు దారి తీసింది. అయితే ఇప్పుడు ఆయన వీడియో సందేశం ద్వారా ప్రజలకు కనిపించారు.
నేడు బుధవారం గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాక్ మా పాల్గొన్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తెలిపింది. దీనికి సంబంధించి వీడియోను గ్లోబల్ టైమ్స్ రిపోర్టర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. 2015 నుంచి జాక్ మా ఫౌండేషన్ ద్వారా గ్రామీణ విద్య, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం గ్రామీణ ఉపాధ్యాయులకు జాక్ మా ఫౌండేషన్ అవార్డులు ప్రధానం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాక్ మా పాల్గొన్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, బ్యాంకు రెగ్యులేటరీపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో అతనిని డ్రాగన్ దేశ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే వాదనలు ఉన్నాయి.