ITC News: బయటపడ్డ ఐటీసీ బండారం.. దిల్లీబాబుకు లక్ష చెల్లించాలన్న కోర్టు..
ITC News: ఈ రోజుల్లో వినియోగదారులు చాలా అలర్ట్ గా ఉంటున్నారు. కంపెనీలు చేస్తున్న మాయలను ఇచ్చే పసిగట్టేస్తున్నారు. అదే ఐటీసీ కంపెనీకి రూ.లక్ష పెనాల్టీ పడేలా చేసింది.
చెన్నైకి చెందిన డిల్లిబాబు అనే వినియోగదారుడు ఐటీసీ కంపెనీకి చెందిన సన్ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అతను వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న క్రమంలో రేపర్ పై 16 బిస్కెట్లను చూపిస్తూ.. లోపల కంపెనీ 15 బిస్కెట్లను పెట్టి విక్రయిస్తున్నట్లు గమనించాడు. దీనిపై అతడు స్థానిక స్టోర్ తో పాటు కంపెనీని సంప్రదించినా సంతృప్తికరమైన ప్రతిస్పందన రాలేదు.

దీంతో దిల్లీబాబు ఒక్కో బిస్కెట్ ధర 75 పైసలని పేర్కొంటూ వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ ప్యాకెట్లను తయారు చేస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ లెక్కన కంపెనీ ప్రతిరోజూ వినియోగదారులను రూ.29 లక్షల మేర మోసం చేస్తోందంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే దీనిపై ఐటీసీ తరఫున న్యాయవాదులు తాము బిస్కెట్ల సంఖ్య ఆధారంగా కాకుండా బరువు ఆధారంగా విక్రయిస్తామని తమ వాదనలు వినిపించారు.
అయితే సన్ఫీస్ట్ మేరీ లైట్ ప్యాకెట్ పై నికర బరువు 76 గ్రాములుగా పేర్కొనగా.. 15 బిస్కెట్లు ఉన్న ఒక్కో ప్యాక్ 74 గ్రాముల బరువు మాత్రమే ఉన్నట్లు కోర్టు గుర్తించింది. 2011 నాటి లీగల్ మెట్రాలజీ నిబంధనలు ముందుగా ప్యాక్ చేసిన వస్తువులలో గరిష్టంగా 4.5 గ్రాముల వ్యత్యాసాన్ని అనుమతించినట్లు ITC వాదించింది. అయితే అస్థిర ఉత్పత్తుల విషయంలో మాత్రమే ఇటువంటి మినహాయింపులు చెల్లుబాటు అవుతాయని.. బిస్కెట్లు కాలక్రమేణా బరువు తగ్గవు కాబట్టి ఈ నియమం వర్తించదని కోర్టు స్పష్టం చేస్తూ వాదనను తిరస్కరించింది.
దీంతో దిల్లీబాబుకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఐటీసీని కోర్టు ఆగస్టు 29న ఆదేశించింది. నిర్దిష్ట బ్యాచ్ బిస్కెట్ల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని కూడా కోర్టు ఆదేశించింది.


Click it and Unblock the Notifications