Mana Ooru-Mana Badi: వేగంగా మారుతున్న ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రాథమికమైనది విద్య. చదువుకు పిల్లలను చేరువ చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని విసృతంగా క్షేత్రస్థాయికి తీసుకెళుతోంది. ఇందులో భాగంగా స్కూళ్లలో అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఇందులో భాగంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' కింద రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో ఐటీ మంత్రి కేటీఆర్ సుమారు 2 వేల మంది విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. దీనికి ముందు 1000 ట్యాబ్లు పంపిణీ చేసిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. పోటీపరీక్షల కోసం సిద్దమయ్యే విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ వీటి ద్వారా అందిస్తున్నట్లు వెల్లడించారు.
రూ.10,000 విలువైన ఒక్కో ట్యాబ్తో పాటు రూ.75,000 ఖరీదైన స్టడీ మెటీరియల్ ఉచితంగా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకుంటే వారి తల్లిదండ్రులే కాకుండా ప్రభుత్వం కూడా సంతోషపడుతుందని అన్నారు.
గంభీరావుపేట మండలంలో ప్రస్తుతం ఉన్న కేజీ టూ పీజీ క్యాంపస్తో సమానంగా ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాలను కార్పొరేట్ విద్యాసంస్థ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం రూ.7 కోట్లను కేటాయిస్తామని కేటీఆర్ వెల్లడించారు. కళాశాల మైదానాన్ని మినీ స్టేడియంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ పిల్లలతో మమేకమై గడిపటం వారిలో సంతోషాన్ని నింపింది.