Infosys Q2 Results: ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలు.. అనుకున్నదొకటి అయ్యిదొకటి..!!
Infosys Q2 Results: టీసీఎస్ తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ కొనసాగుతోంది. నిన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత నేడు ఇన్ఫోసిస్ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను వెలువరించింది.
సెప్టెంబరు 2023తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.38,994 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో రూ.6,212 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన రూ.6,021 కోట్ల నికర లాభం కంటే 3.17% అధికం. ఇన్ఫోసిస్ పనితీరు అంచనాలకు అనుగుణంగా విస్తృతంగా వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ డివిడెండ్లను కూడా ప్రకటించింది.

స్థిరమైన కరెన్సీలో కంపెనీ ఆదాయ వృద్ధి ఏడాది ప్రాతిపదికన 2.5 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 2.3 శాతంగా ఉంది. ఈ క్రమంలో కంపెనీ నిర్వహణ మార్జిన్ 21.2%గా ఉంది. గడచిన రెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 7.7 బిలియన్ డాలర్ల TCV భారీ డీల్ను గెలుచుకుంది. ఐటీ దిగ్గజం నేడు ఫలితాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర 2.82 శాతం క్షీణించి రూ.1,452.30 వద్ద ముగిసింది.
అలాగే ఇన్ఫోసిస్ కూడా ఈరోజు ఒక్కో షేరుకు రూ.18 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. FY24లో స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం 1.0-2.5% పెరుగుతుందని ఇన్ఫోసిస్ అంచనా వేసింది. మారిన వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ తన భవిష్యత్తు మార్గదర్శకాలను మార్చుకుంటోంది.


Click it and Unblock the Notifications