ఐటీ లేఆఫ్లు: రియల్ ఎస్టేట్ కుదేలు! మీ ఇల్లు అమ్ముడుపోతుందా?
కొంతకాలంగా ఐటీ రంగంలో లేఆఫ్ల (ఉద్యోగాల కోత) పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ తొలగింపులు ఆయా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులనే కాకుండా, రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రాకెట్ వేగంతో దూసుకెళ్లిన రియల్ ఎస్టేట్ రంగం, ఇప్పుడు కంపెనీలు చేపడుతున్న ఉద్యోగ కోతల కారణంగా మాంద్యంలోకి జారుకుంది. ముఖ్యంగా బెంగళూరు, పుణె మాత్రమే కాకుండా హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇళ్లు కొనేవారి సంఖ్య తగ్గడం మొదలైంది. దీంతో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య కూడా పెరగడం ప్రారంభమైంది.
అసలు ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?: ఐటీ కంపెనీల ఉద్యోగ కోతల చర్యలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఎప్పుడు ఉద్యోగం పోతుందోనన్న భయంతోనే విధులకు హాజరవుతున్నారు. ఇటీవల, అమెరికాకు చెందిన ఒరాకిల్ (Oracle) కంపెనీ ఏకంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించింది.

రాబోయే కాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని సమాచారం. అంతేకాదు, భారతదేశపు అగ్రగామి ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ (TCS), 2026 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 23,460 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. ఇలాంటి కారణాల వల్ల, ఇప్పుడు ఇల్లు కొంటే, లోన్ సరిగ్గా కట్టగలమా లేదా అనే సందిగ్ధంలో ఐటీ ఉద్యోగులు పడిపోయారు.
నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) అనే సంస్థ ఇటీవల ఒక సర్వే చేసి నివేదికను విడుదల చేసింది. భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే, ఐటీ నగరాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లోనే అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ నివేదికలో పేర్కొంది. 2026 మొదటి త్రైమాసికంలో ఒక్క బెంగళూరులోనే 23 శాతం ఇళ్లు అమ్ముడుపోలేదని తేలింది. అంటే, సుమారు 71,611 ఇళ్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయన్నమాట. అదేవిధంగా, పుణెలో 12 శాతం, హైదరాబాద్లో 3 శాతం ఇళ్లు ఇంకా అమ్ముడుపోలేదని ఆ నివేదిక తెలిపింది.
అనరాక్ సంస్థ కూడా ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. అందులో అమ్మకాల క్షీణత స్పష్టంగా నమోదైంది. 2026 మొదటి త్రైమాసికంలో పుణెలో ఇళ్ల అమ్మకాలు 3 శాతం వరకు పడిపోయాయి. అదేవిధంగా, హైదరాబాద్ 4 శాతం క్షీణతను చవిచూసింది. బెంగళూరులో కూడా ఇళ్ల అమ్మకాల్లో ఎలాంటి వృద్ధి కనిపించలేదు.
ఐటీ రంగంలో నెలకొన్న ఈ మాంద్యం కారణంగా, ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఇప్పటికే బుక్ చేసుకున్న ఇళ్లను కూడా రద్దు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో, ఈ ఏడాది అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 3 నుంచి 4 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
ఇలాంటి ఎన్నో సవాళ్లు రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేస్తున్నప్పటికీ, GCC (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్)ల రాక పెరగడం కొంత ఆశను రేకెత్తిస్తోంది. చాలా విదేశీ కంపెనీలు తమ శాఖలను విస్తరించేందుకు భారతదేశంలో ఆఫీస్ స్పేస్ల కోసం వెతుకుతున్నాయి. ఇందుకోసం కొన్ని కంపెనీలు స్థలాలను అద్దెకు తీసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఇళ్ల అమ్మకాల పతనం కొనసాగుతుందా? లేక పుంజుకుంటుందా? అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications