IT News: నిరాశలో ఐటీ ఫ్రెషర్లు.. అంతులేని ఆవేదన అందుకే..!
IT News: దేశంలోని ఐటీ ఫెషర్ల పరిస్థితి దిగజారుతోంది. 2022 మార్చిలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించినప్పటికీ ఆన్ బోర్డ్ కాని చాలా మంది నిరాశకు గురయ్యారు.
దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగం పొందినట్లు ఈ-మెయిల్ పొందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు భయపడుతున్నారు. అయితే కంపెనీ నుంచి అప్డేట్ కోసం అంతులేని వారి ఎదురుచూపులు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో నెలలోపు ఆన్బోర్డ్ చేస్తామని చెప్పిన కంపెనీ తొమ్మిది నెలలైనా స్పందించటం లేదని ఒక మహిళా అభ్యర్థి వెల్లడించారు.
ఈ క్రమంలో చాలా మంది తమ కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయలేక పోతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు.ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఆఫర్ పొందినప్పటికీ ఐటీ రంగం అధ్వానంగా మారటంతో ఆందోళన చెందుతున్నారు. విప్రో, ఎల్టిఐమిండ్ట్రీ, ఎంఫాసిస్, ఇన్ఫోసిస్ తో పాటు ఇతర అనేక కంపెనీల ద్వారా ఫ్రెషర్ ఆన్బోర్డింగ్ ఆలస్యం చేయబడింది.
టెక్ మహీంద్రా నుండి ఏడాదిన్నరగా కాల్ కోసం ఎదురుచూస్తున్న మరో ఫ్రెషర్ రితేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డ్రైవ్ రద్దు చేసిన విషయం అప్ డేట్ చేయలేదని నిరాశ వ్యక్తం చేశాడు. అలాగే అనేక టెక్ కంపెనీల్లో ఆన్బోర్డింగ్ ఆలస్యం కావడంతో ఫ్రెషర్లు ఒకచోట చేరి టెలిగ్రామ్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. తమలో తాము సమాచారం పంచుకోవటానికి, సమన్వయానికి వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే దాదాపు ఏడాది పాటు నిరీక్షించిన తర్వాత కూడా కంపెనీల నుంచి సరైన అప్ డేట్స్ రాకపోవటంతో గ్రూప్స్ మ్యూట్ అయ్యాయి.
ప్రస్తుతం నాన్ టెక్నికల్ పోస్టులు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయని వేచి ఉన్న అభ్యర్థులు చెబుతున్నారు. ఇదే క్రమంలో తాము తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్స్ చెల్లింపులు దగ్గర పడుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడితో పాటు.. లోన్ రీపేమెంట్స్ కోసం బ్యాంకుల నుంచి వస్తున్న కాల్స్ తో అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొందరైతే వేచిచూడటాన్ని మానేసి స్వగ్రామాలకు వెళ్లి ఇతర పనులు చేసుకుంటున్నారు. ఏఐ అందుబాటులోకి రావటంతో రానున్న కాలంలో టెక్కీలకు డిమాండ్ భారీగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.