IT Jobs: ఐటీ కంపెనీ మాస్టర్ ప్లాన్.. ఇలా మోసం చేస్తుందని మీరు అస్సలు ఊహించరు.. మ్యాటర్ కార్మిక శాఖకు..
IT Jobs: ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాయి. జీతాల చెల్లింపుల నుంచి రిక్రూట్ మెంట్ వరకు అన్నింటిలోనూ ఉద్యోగులకు అన్నాయమే జరుగుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించటం, మరికొన్ని వేరియబుల్ పే నిలిపివేయటం లేదా తగ్గించటం వంటి ఇబ్బందులకు గురిచేయటం మనందరం చూస్తున్నాం. ఈ క్రమంలో మరో సంచలన విషయంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై కోర్టుకు వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది.
విప్రో మోసం..
ఉద్యోగులను తొలగించి, వేరియబుల్ పే తగ్గించటం చేసిన విప్రో విషయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. కంపెనీ అవసరాల కోసం అదనంగా నియమించుకున్న సిబ్బందికి ప్లేస్మెంట్లు ఇచ్చినట్లే ఇచ్చింది కానీ వారికి అపాయింట్మెంట్ లెటర్లు పంపలేదు. దీనివల్ల చాలా మంది ఐటీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. అక్టోబర్ 2021లో ఎంపిక చేసిన చాలా మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలను ఇవ్వలేదు.
ఆన్బోర్డింగ్ నిలిపివేత..
దాదాపు 11 నెలలు గడుస్తున్నా సెలెక్ట్ అయిన వారికి ఆన్బోర్డింగ్ చేయకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఆన్బోర్డింగ్ అనేది సంస్థకు ఎంచుకున్న ఉద్యోగిని అధికారికంగా చేర్చడం. అంటే వీరందరూ కంపెనీ ఎప్పుడు పిలుస్తుందా అని నిరీక్షించేవారు. దీంతో ఆగ్రహం చెందిన అనేక మంది ఎంపికైన టెక్కీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విప్రోలో సెలెక్ట్ అయినందుకు పాత కంపెనీల్లో ఉద్యోగం మానేశామని.. ప్రస్తుతం జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. ఇలా వేచి ఉండటం వల్ల వారు దాదాపు 11 నెలల జీతాన్ని కోల్పోయారు.
ఉద్యోగుల ఆవేదన..
ఈ వివాదంపై స్పందించిన ఒక ఉద్యోగి తాను విప్రోలో ఉద్యోగం వచ్చినందున కాగ్నిజెంట్కు రాజీనామా చేశానని తెలిపాడు. అయితే ఇప్పుడు తనకు పనితో పాటు జీతం కూడా లేకుండా పోయిందని.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని వాపోయాడు. దీనిపై విప్రో హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ అధికారులు ఎలాంటి స్పందనా ఇవ్వలేదని తెలిపాడు. మరో వ్యక్తి పెద్ద కంపెనీ అయిన విప్రోలో ఉద్యోగం వచ్చిందని స్టార్టప్ జాబ్ వదులుకున్నానని.. 6 నెలలు గడుస్తున్నా నిరీక్షిస్తున్నట్లు వివరించాడు.
వ్యవహారం కార్మిక శాఖకు..
2021 సెప్టెంబర్లోనే 2000 మంది విద్యార్ధులను క్యాంపస్ ఇంటర్వ్యూల విధానంలో విప్రో ఎంపిక చేసుకుంది. శిక్షణ పూర్తైనప్పటికీ వారిని ఉద్యోగాల్లోకి తీసుకోకపోవటంపై నాస్సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ కేంద్ర కార్మిక శాఖను కోరింది. పైగా శిక్షణ కోసం అయ్యే రూ.30 నుంచి రూ.40 వేలను విద్యార్థులే భరించాలని కంపెనీ తెలిపింది. ఇంటర్నషిప్ కాలంలో విద్యార్ధి ఉద్యోగులకు ఎలాంటి వేతనాలు చెల్లించలేదు. నియామకాలను వాయిదా వేస్తూ వస్తోందని తన ఫిర్యాదులో వెల్లడించింది. కేంద్ర కార్మిక శాఖ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.