IT News: 2023లో దారుణంగా మారిన టెక్కీల పరిస్థితి.. మరీ ఇంతలా అనుకోలేదు..!
IT News: కొత్త ఏడాది మీద కోటి ఆశలు పెట్టుకున్నారు టెక్కీలు. పరిస్థితులు మెల్లగా సర్థుకుంటాయని తమకు లేఆఫ్స్ ప్రభావం ఉండదని అనుకున్నారు. అయితే అనూహ్యంగా కొత్త సంవత్సరంలో చాలా కంపెనీలు తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రతిరోజూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. దీంతో హైరింగ్ లేకపోయినా పర్లేదు ఫైరింగ్ కాకుండా ఉండాలని టెక్కీలు ఆశిస్తున్నారు.
ప్రధానంగా అమెరికా మార్కెట్లలో ఆర్థిక అస్థిరతలతో ప్రేరేపితమౌతున్న మాంద్యం ఒకపక్క ఇప్పటికే క్షీణించిన యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ మరోపక్క ఉండటం భారత ఐటీ రంగాన్ని తీవ్రంగా ఒత్తిళ్లకు గురిచేస్తోంది. ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న రెండు మార్కెట్లు దెబ్బతినటం వల్ల కంపెనీల ఆదాయాలు, మార్జిన్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ క్రమంలో టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాలు సైతం నియామకాలను భారీగా తగ్గించాయి.

కంపెనీలు న్యూ హైరింగ్ తగ్గించటం కారణంగా కొత్త ఏడాదిలో నియామకాలు ఏకంగా 66 శాతం మేర పడిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో నాలుగు టెక్ కంపెనీలు దాదాపు 2.43 లక్షల నియామకాలను చేసుకోగా.. ఈ ఏడాది ఇదే సమయంలో కేవలం 82,679 ఉద్యోగులను మాత్రమే నియమించుకున్నాయి. గడచిన ఎనిమిది త్రైమాసికాల్లో ఇంత తక్కువ నియామకాలు నమోదు కావటం ఇదే తొలిసారని తెలుస్తోంది.
వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వృద్ధి చెందుతున్నందున ఈ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే కంపెనీలు మాత్రం ఏఐ వినియోగాన్ని అందిపుచ్చుకుని తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ఇటీవల ఐబీఐ సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అంటే రానున్న కాలంలో ఏఐ టెక్కీలకు ఉద్యోగాలను పొందే విషయంలో పోటీని ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కంపెనీలకు డీల్స్ తగ్గుతున్న తరుణంలో ఉన్న ఉద్యోగులను అత్యుత్తమంగా వినియోగించుకోవాలని చూస్తున్నాయి. అయినప్పటికీ కంపెనీల్లో ప్రాజెక్టులు అలకేట్ కాక బెంచ్ పై ఉంటున్న టెక్కీల సంఖ్య అధికంగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పైగా భారత ఐటీ సేవల కంపెనీలు ఎక్కువగా పనిచేసే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలోని కంపెనీలు ఇప్పుడు అమెరికా, యూరప్ లలో సంక్షోభంలో ఉండటం రికవరీకి ఎంత సమయం పడుతుందనే ఆందోళనలను సృష్టిస్తోంది.


Click it and Unblock the Notifications